మేఘన్‌ గురించి తప్పుగా మాట్లాడాడు.. గల్లా పట్టి కొట్టాడు! సంచలనాలకు ప్రిన్స్‌ హ్యారీ రెడీ

5 Jan, 2023 11:18 IST|Sakshi

శాక్రమెంటో: బ్రిటన్‌ రాజకుటుంబంలో కుటుంబ కలహాలు సమసిపోయి అంతా సర్దుకుంటుందనుకుంటున్న సమయంలో.. మరో పరిణామం చోటు చేసుకుంది.  డ్యూక్‌ ఆఫ్‌ సస్సెక్స్‌, ప్రిన్స్‌ హ్యారీ సంచలనాలకు తెర తీశాడు. తన ఆత్మకథ ‘స్పేర్‌’ ద్వారా బయటి ప్రపంచానికి రాజ‘కుటుంబ’ కలహాలను పూసగుచ్ఛినట్లు వివరించేందుకు సిద్ధమయ్యాడు.  ఈ క్రమంలో తన అన్న, ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌ అయిన విలియమ్‌ తనపై భౌతిక దాడికి దిగాడని, అందుకు తన భార్య మేఘన్‌ మార్కెల్‌ కారణమని చెబుతూ పెద్ద షాకే ఇచ్చాడు.  

ది గార్డియన్‌ కథనం ప్రకారం.. స్పేర్‌ ఆత్మకథలోని ఆరో పేజీలో ప్రిన్స్‌ హ్యారీ ఈ విషయాన్ని తెలియజేశాడు. మేఘన్‌ మార్కెల్‌ విషయంలో తన అన్నతో తనకు వాగ్వాదం జరిగిందని, పట్టరాని కోపంతో విలియమ్‌ తనపై దాడికి దిగాడని హ్యారీ అందులో పేర్కొన్నాడు. మేఘన్‌ స్వభావాన్ని ఉద్దేశించి విలియమ్‌ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అయితే.. తన భార్య గురించి తప్పుగా మాట్లాడొద్దంటూ ఆమెకు మద్దతుగా హ్యారీ ఏదో సర్ది చెప్పబోయాడట. ఈ క్రమంలో సహనం కోల్పోయిన విలియమ్‌ పట్టరాని కోపంతో ఊగిపోయాడు. హ్యారీ గల్లా పట్టుకుని.. మరో చేత్తో మెడలో గొలసును లాగిపడేశాడు. హ్యారీని నేలకేసి కొట్టాడు. కింద.. కుక్కకు భోజనం పెట్టే పాత్ర తగిలి హ్యారీ వీపుకు గాయమైంది. కష్టంగానే పైకి లేచిన ప్రిన్స్‌ హ్యారీ.. బయటకు వెళ్లిపోమని విలియమ్‌ మీదకు అరిచాడు. కోపంగానే విలియమ్‌ గది నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఈ పరిణామంతా చాలా వేగంగానే జరిగింది. ఈ ఘటనలో హ్యారీ వీపునకు అయిన గాయం మానడానికి నెలలు పట్టింది అని ఆ కథనం ఆ పేజీ సారాంశాన్ని తెలిపింది. 

ఇంకా ఈ బుక్‌.. ఎన్నో ఆసక్తికరమైన, రాజకుటుంబం నుంచి దిగ్భ్రాంతికరమైన విషయాలను వెలుగులోకి తేనుందని గార్డియన్‌ కథనం పేర్కొంది.  జనవరి 10వ తేదీన స్పేర్‌ మార్కెట్‌లోకి రీలీజ్‌ కానుంది.  
 
గత సెప్టెంబర్‌లో తల్లి క్వీన్‌ ఎలిజబెత్‌-2 మరణం, ఈ మే నెలలో తండ్రి కింగ్‌ ఛార్లెస్‌-3కి పట్టాభిషేకం దరిమిలా.. మధ్యలో ఈ అన్నదమ్ముల ఘర్షణ గురించి వెలుగులోకి రావడం, అదీ హ్యారీ ఆత్మకథ ద్వారా కావడం ఇక్కడ గమనార్హం. కలిసిపోతారనుకున్న అన్నదమ్ములను.. ఆ ఆత్మకథ మరింత దూరం చేసేలా కనిపిస్తోంది!.

2020లో రాజరికాన్ని, బ్రిటన్‌ వదిలేసి హ్యారీ-మార్కెల్‌ జంట కాలిఫోర్నియాకు వెళ్ల స్థిరపడింది. ఆ సమయం నుంచే ఆ అన్నదమ్ముల మధ్య గ్యాప్‌ వచ్చింది. అయితే.. 2021లో ఈ ఆలుమగలు ఓప్రా విన్‌ఫ్రే ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాలు వెల్లడించడం ద్వారా రాజకుటుంబంలోని అన్నదమ్ములు, వాళ్ల వాళ్ల భార్యల మధ్య కలహాలు వెలుగులోకి రావడం మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా చర్చనీయాంశంగా మారాయి కూడా.

మరిన్ని వార్తలు