రైతులకు మద్దతుగా లండన్‌లో నిరసనలు..

8 Dec, 2020 11:35 IST|Sakshi

లండన్‌ : భారతదేశంలో కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనకు దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. ఈ క్రమంలో యూకేలోని వివిధ ప్రాంతాల నుంచి సెంట్రల్ లండన్‌లోని భారత హైకమిషన్ భవనం వద్దకు చేరుకొని నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు. ఈ నిరసనలపై స్పందించిన బ్రిటిష్‌ హైకమిషన్‌.. ఈ సమస్యపై మెట్రోపాలిటన్ పోలీసులు, అక్కడి భారత బృందంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సోమవారం తెలిపింది. "నిరసనలు మెట్రోపాలిటన్ పోలీసులకు సంబంధించిన విషయం. నిరసన గురించి లండన్‌లోని భారత హైకమిషన్, మెట్రోపాలిటన్ పోలీసుల నుంచి మేము వివరాలు సేకరిసస్తున్నాం" అని బ్రిటిష్ హైకమిషన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. చదవండి: భారత్‌ బంద్‌; కాసేపట్లో హైదరాబాద్‌- బెంగళూర్‌ హైవే దిగ్భందం 

కాగా యూకేలో పెద్ద మొత్తంలో ప్రవాస భారతీయులు ఉన్నారు. దీంతో భారత్‌లో రైతులు చేస్తున్న నిరసనల ప్రభావం యూకేలోని పంజాబీలపై పడుతుందని భావించిన బ్రిటిష్ సిక్కు లేబర్ ఎంపీ తన్మన్‌జీత్ సింగ్ ధేసీ నేతృత్వంలోని 36 మంది బ్రిటిష్ ఎంపీల బృందం యూకే విదేశాంగ కార్యదర్శి డొమినిక్ రాబ్‌కు లేఖ రాశారు. అనంతరం రైతులకు మద్దతుగా లండన్‌లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇక భారతదేశంలోని రైతులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలు 2020 కి వ్యతిరేకంగా భారీ ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. కొత్త వ్యవసాయ చట్టాల్లో కనీస మద్దతు ధరకు భద్రతా లేకపోవడం, కార్పొరేట్‌ సంస్థలకు ఈ చట్టాలు అనుకూలంగా ఉన్నాయన్న కోణంలో రైతులు ఆందోళనలు దిగారు. చదవండి: పాత చట్టాలతో కొత్త శతాబ్దం నిర్మించలేం

కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు:
1. రైతుల ఉత్పత్తుల వర్తక, వాణిజ్యం బిల్లు 2020
2. ధరల హమీ వ్యవసాయ సేవాల బిల్లు 2020
3. నిత్యవసర వసస్తువుల(సవరణ) బిల్లు 2020.. సెప్టెంబర్‌లో అమల్లోకి వచ్చిన ఈ మూడు వ్యవసాయ చట్టాలు వ్యవసాయ రంగంలో ప్రధాన సంస్కరణలుగా ప్రభుత్వం భావించింది. మధ్యవర్తులను తొలగించి, దేశంలో ఎక్కడైనా ధాన్యం విక్రయించడానికి వీలు కల్పించింది. 

మరిన్ని వార్తలు