బైడెన్, కిషిడా, అల్బనీస్లతో చర్చలు
ఉగ్రవాదాన్ని, చైనా విస్తరణవాదాన్ని తీవ్రంగా ఖండించిన క్వాడ్ శిఖరాగ్రం
టోక్యో: పరస్పర విశ్వాసం, చిత్తశుద్ధే క్వాడ్ కూటమి బలమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇండో పసిఫిక్ను స్వేచ్ఛాయుత ప్రాంతంగా రూపుదిద్దడంలో ఈ నాలుగు దేశాల కూటమిది కీలక పాత్ర అంటూ ప్రశంసించారు. భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలతో కూడిన క్వాడ్ శిఖరాగ్ర సదస్సు మంగళవారం టోక్యోలో జరిగింది. కూటమిని మరింత ముందుకు తీసుకెళ్లే మార్గాలు తదితరాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా, జపాన్ ప్రధానులు అల్బనీస్, ఫుమియో కిషిడాలతో మోదీ లోతుగా చర్చించారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో క్వాడ్ నిర్మాణాత్మక పాత్ర పోషిస్తోందన్నారు.
ఉగ్రవాదాన్ని క్వాడ్ శిఖరాగ్రం ముక్త కంఠంతో ఖండించింది. పాకిస్తాన్ పాల్పడ్డ ముంబై, పఠాన్కోట్ ఉగ్ర దాడులను తీవ్రంగా నిరసించింది. సీమాంతర దాడులకు ప్రోత్సాహాన్ని, ఉగ్రవాద తండాలకు సైనిక, ఆర్థిక, వ్యూహాత్మక మద్దతును మానుకోవాలని పాకిస్తాన్ను ఉద్దేశించి హితవు పలికింది. చైనా విస్తరణవాదాన్ని, పొరుగు దేశాల సరిహద్దుల్లో చొరబడుతున్న తీరును కూడా నిరసించింది. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో యథాతథ స్థితిని మార్చేందుకు, ఉద్రిక్తతలను పెంచేందుకు జరుగుతున్న ఏకపక్ష ప్రయత్నాలను, కవ్వి ంపు చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు పేర్కొంది. క్వాడ్ నేతలు ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. అనంతరం కిషిడా, అల్బనీస్లతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. పరస్పర బంధాలను బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు.
పుతిన్పై బైడెన్ నిప్పులు