నిర్ణయాల పురోగతిని సమీక్షిస్తాం

23 May, 2022 06:33 IST|Sakshi

క్వాడ్‌ శిఖరాగ్ర సమావేశంపై ప్రధాని

జపాన్‌ రాజధాని టోక్యోకు చేరుకున్న మోదీ

న్యూఢిల్లీ: క్వాడ్‌ కూటమి ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాల అమలు పురోగతిని టోక్యో శిఖరాగ్ర సమావేశాల్లో సమీక్షిస్తామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. సభ్య దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటామని చెప్పారు. ఈ నెల 23, 24వ తేదీల్లో జపాన్‌లో జరగనున్న క్వాడ్‌ శిఖరాగ్ర భేటీకి బయలుదేరే ముందు ప్రధాని ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

ఆయా దేశాల నేతల రెండో ముఖాముఖి భేటీలో ఇండో–పసిఫిక్‌ ప్రాంతంతోపాటు, పరస్పరం ఆసక్తి ఉన్న ఇతర అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలను పంచుకుంటామన్నారు. జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిడా ఆహ్వానం మేరకు టోక్యో వెళ్తున్నానన్నారు. ఇండో–జపాన్‌ ప్రత్యేక వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా కిషిడాతో చర్చలుంటాయని ప్రధాని వెల్లడించారు.

ఆస్ట్రేలియా నూతన ప్రధాని అంటోనీ అల్బనీస్‌ కూడా మొదటిసారిగా ఈ సమావేశానికి వస్తున్నారని చెప్పారు. భారత్‌–ఆస్ట్రేలియా మధ్య బహుళ రంగాల్లో సహకారాన్ని విస్తరించుకోవడంపై, పరస్పరం ఆసక్తి ఉన్న అంశాలపైనా చర్చలు జరుపుతామన్నారు. ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో చైనా విస్తరణ వాదానికి అడ్డుకట్ట వేయడమేలక్ష్యంగా ఏర్పడిన క్వాడ్‌లో భారత్‌తోపాటు జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా ఉన్నాయి.

బైడెన్‌తో నిర్మాణాత్మక చర్చలు
అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో జరిగే సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తరించుకోవడంతోపాటు, ప్రాంతీయ, వర్తమాన అంతరా>్జతీయ పరిణామాలపైనా చర్చిస్తామని ప్రధాని మోదీ చెప్పారు. ఎటువంటి దాపరికాలు లేకుండా, నిర్మాణాత్మకంగా ఈ చర్చలు ఉంటాయన్నారు. రష్యా–ఉక్రెయిన్‌ సంక్షోభం విషయంలో రష్యాపై తీవ్ర చర్యలు తీసుకోవాలన్న అమెరికా వైఖరిని జపాన్, ఆస్ట్రేలియా బలపరుస్తుండగా,  సమస్యకు శాంతియుత పరిష్కారం కనుగొనాలని భారత్‌ గట్టిగా కోరుతోంది.

మరిన్ని వార్తలు