బ్రిటన్‌ రాణి దంపతులకు కోవిడ్‌ టీకా

11 Jan, 2021 05:04 IST|Sakshi

లండన్‌ : బ్రిటన్‌ రాణి ఎలిజెబెత్, ఆమె భర్త ప్రిన్స్‌ ఫిలిప్‌కు కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ ఇచ్చారు. విండ్సర్‌ కేజల్‌లో ఉంటున్న రాణి దంపతులకు ఫ్యామిలీ డాక్టర్‌ శనివారం నాడు కరోనా టీకా మొదటి డోసు ఇచ్చినట్టుగా బకింగ్‌çహామ్‌ ప్యాలెస్‌ వర్గాలు వెల్లడించాయి. రాణి, రాజు వ్యక్తిగత ఆరోగ్యానికి సంబంధించిన అంశాలను బయట ప్రపంచానికి వెల్లడించడం చాలా అరుదుగా జరుగుతుంది.

ఎలాంటి ఊహాగానాలకు తావుండ కూడదని తామిద్ద్దరికీ వ్యాక్సిన్‌ ఇచ్చినట్టుగా మహారాణియే  స్వయంగా ప్రజలందరికీ వెల్లడించమన్నారని ఆ వర్గాలు తెలిపాయి. ఎలిజెబెత్‌ వయసు 94 కాగా, ఫిలిప్‌ వయసు 99 సంవత్సరాలు. కరోనా వైరస్‌ కొత్త స్ట్రెయిన్‌తో వణికిపోతున్న బ్రిటన్‌లో ఇప్పటివరకు 15 లక్షల మందికి కరోనా టీకా మొదటి డోసు ఇచ్చారు. బ్రిటన్‌లో 80 ఏళ్లు పైబడిన వారికి తొలి ప్రాధాన్యంగా టీకా ఇస్తున్నారు. అయితే రాణి దంపతులకి ఏ కంపెనీ వ్యాక్సిన్‌ ఇచ్చారో తెలియలేదు. అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్‌ వ్యాక్సిన్, ఆక్స్‌ఫర్డ్‌– ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌లు ప్రస్తుతం బ్రిటన్‌లో ఇస్తున్నారు.

మరిన్ని వార్తలు