డ్రాగన్కు రాజ్నాథ్ చురకలు
మాస్కో : షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) భేటీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చైనా మంత్రి సమక్షంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పరస్పర విశ్వాసం, సంయమనం, సామరస్య పరిష్కారం, అంతర్జాతీయ నిబంధనలను గౌరవించడం ద్వారానే ఈ ప్రాంతంలో శాంతి సుస్ధిరత నెలకొల్పగలమని రాజ్నాథ్ సింగ్ అన్నారు. భద్రత, రక్షణ వ్యవహారాలపై దృష్టి కేంద్రీకరించే ఎనిమిది దేశాల ఎస్సీఓలో భారత్, చైనా సభ్య దేశాలుగా ఉన్నాయి. ప్రపంచ జనాభాలో 40 శాతానికి పైగా జనాభా కలిగిన ఎస్సీఓ సభ్య దేశాల మధ్య పరస్పర సహకారం, ఇచ్చిపుచ్చుకునే ధోరణి కీలకమని అన్నారు.
విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకోవడం, ఒకరి ప్రయోజనాలను మరొకరు గుర్తెరగడం అవసరమని మాస్కోలో జరిగిన ఎస్సీఓ మంత్రుల భేటీలో రాజ్నాథ్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో చైనా రక్షణ మంత్రి జనరల్ వీ ఫెంఘే కూడా పాల్గొన్నారు. సరిహద్దు వివాదంతో భారత్-చైనాల మధ్య ఎల్ఏసీ వెంబడి ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. తూర్పు లడఖ్లోని గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు మరణించినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సరిహద్దు వెంబడి భారత్, చైనా యుద్ధ ట్యాంకులు, పదాతిదళాలతో మోహరించడంతో ఎప్పుడేం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. చదవండి : భారత్లోనే ఏకే–47 తయారీ!