నేపాల్‌ అధ్యక్షుడిగా రామ్‌ చంద్ర పౌడెల్‌

13 Mar, 2023 16:55 IST|Sakshi

నేపాల్‌ అధ్యక్షుడిగా సీనియర్‌ నేపాలీ కాంగ్రెస్‌ నాయకుడు రామచంద్ర పాడెల్‌ సోమవారం ప్రమాణం చేశారు. ఈ మేరకు శీతల్‌ నివాస్‌లోని రాష్ట్రపతి కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి హరి కృష్ణ కర్కీ 78 ఏళ్ల పౌడెల్‌ చేత ప్రమాణం చేయించారు. పౌడెల్‌ నేపాల్‌ కొత్త అధ్యక్షుడిగా గురవారం ఎన్నికయ్యారు. ఆయన అధ్యక్ష ఎన్నికల్లో 33,802 ఓట్లు సాధించగా, పౌడెల్‌ ప్రత్యర్థి సుభాష్‌ చంద్ర నెంబ్వాంగ్‌ 15,518 ఓట్లు సాధించారు. ఈ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో ఫెడరల్‌ పార్లమెంట్‌లోని 313 మంది సభ్యులు, అలాగే ప్రాంతీయ అసెంబ్లీల నుంచి 518 మంది సభ్యులు పాల్గొన్నారు.

ఈ ఓటింగ్‌ ఖాట్మాండ్‌లోని న్యూ బనేశ్వర్‌లోని నేపాల్‌ పార్లమెంట్‌లో జరిగింది. నేపాల్‌ ఎన్నికల సంఘం ఫెడరల్‌​ పార్లమెంటేరియన్లు, ప్రావిన్స్‌ అసెంబ్లీ సభ్యుల కోసం రెండు వేర్వేరు పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేసింది. ఈ అధ్యక్ష ఎన్నికల కోసం అన్ని ప్రావిన్సులకు చెందిన శాసనసభ్యులు ఖాట్మాండుకు చేరుకున్నారు. ఇందులో 884 మంది పార్లమెంట్‌ సభ్యులు ఉన్నారు. అందులో 274 మంది సభ ప్రతినిధుల​ సభ్యులు, 59 మంది నేషనల్‌ అసెంబ్లీ సభ్యులు కాగా, ఏడు ప్రావిన్షియల్‌ అసెంబ్లీలకు చెందిన 550 మంది సభ్యులు ఉన్నారు.

ఈ మేరకు పౌడెల్‌ మాట్లాడుతూ.."పాలనలో తనకు అనుభవం ఉందని, రాష్ట్ర యంత్రాంగాల పని తీరుకు ఈ కొత్త పదవి సరిపోతుంది. నేపాల్‌ రాచరికం సమయంలో మాజీ హౌస్‌ స్పీకర్‌గా పనిచేసిన పౌడెల్‌ తనకు వాటిల్లో అపార అనుభవం ఉంది. ఇంతకుముందు వివిధ ప్రభుత్వ అధికారులుగా బాధ్యతలు నిర్వర్తించాను . రాచరికం సమయాల్లో రాజభవనాలకు వెళ్లాను. సభాపతిని అయ్యాను. వారానికి ఒకసారి ప్యాలెస్‌ని సందర్శించాను. మాజీ అధ్యక్షులతో సమావేశాల్లో పాల్గొన్నాను. అక్కడ చేపట్టాల్సిన విధులు గురించి తనకు తెలుసునని, ఇవేమి తనకు కొత్త కాదు అని" తేల్చి చెప్పారు. కాగా, పౌడెల్‌ మాజీ హౌస్‌ స్పీకర్‌గానే కాకుండా దశాబ్దం పాటు జైల్లో ఉన్నారు కూడా. ఇప్పటి వరకు ఆరుసార్లు శాసన సభ్యుడిగా, ఐదుసార్లు మంత్రిగా పనిచేశారు. ఆయన ఇప్పుడూ నేపాల్‌ దేశానికి మూడవ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గురువారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో పౌడెల్‌కు మొత్తం పది పార్టీల మద్దతు లభించింది.  

మరిన్ని వార్తలు