పాతిపెట్టిన పిల్లిని బయటకు తీసి.. ఆపై

13 Jan, 2021 17:50 IST|Sakshi

వాషింగ్టన్‌: పెంపుడు జంతువులను సొంత బిడ్డల్లా చూసుకునే యజమానులు చాలా మందే ఉంటారు. ముద్దుపేర్లతో పిలుచుకుంటూ చంటిపాపల్లా సాకుతూ వాటికి సపర్యలు కూడా చేస్తారు. ఇక ఏకంగా పెట్స్‌ పేరిట కోట్ల విలువ చేసే ఆస్తులు రాసిన వాళ్ల గురించి కూడా గతంలో ఎన్నో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మూగ జీవాలపై వారికి ఉన్న ప్రేమ అలాంటిది మరి. కానీ అమెరికన్‌ రాపర్‌ అజీలియా బ్యాంక్స్‌ మాత్రం ఇలాంటి వారికి పూర్తి విరుద్ధం. చనిపోయిన తన పెంపుడు జంతువు పట్ల ఆమె అత్యంత అమానుషంగా ప్రవర్తించింది. విగతజీవిని వండుకుని తినేందుకు సిద్ధపడింది. (చదవండి: నువ్వు కొరికితే నేను కూడా కొరుకుతా)

అంతేగాక ఈ నిర్వాకాన్ని వీడియో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి ట్రోలింగ్‌కు గురవుతోంది. వివరాలు.. అజీలియా రాపర్‌ అయినప్పటికీ తన సంచలన వ్యాఖ్యలు, చేష్టలతోనే ఎక్కువగా పాపులర్‌ అయ్యింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆరున్నర లక్షలకు పైగా ఫాలోవర్లను సంపాదించుకున్న ఆమె.. తాను మంత్రగత్తెనని, తన తల్లి నుంచి ఈ విద్య నేర్చుకున్నట్లు 2015లో ప్రకటించింది. జంతువుల పట్ల ఆమె ప్రవర్తించే తీరు కూడా విచిత్రంగా ఉండేది. ఈ క్రమంలో మంగళవారం ఆమె షేర్‌ చేసిన వీడియో విపరీతంగా వైరల్‌ అయ్యింది. ‘‘మీలో చాలా మందికి తెలియదు కదా. లూసిఫర్‌(2009-2020). నా పెంపుడు పిల్లి. మూడు నెలల క్రితం చనిపోయింది. దానిని పాతిపెట్టాం. 

ఇదిగో ఇప్పుడే మళ్లీ బయటకు తీయడం. తనకు జీవం పోశాం. డియర్‌ కిట్టీ థాంక్యూ. నువ్వొక లెజెండ్‌. ఐకాన్‌. సర్వ్‌ చేయడానికి సిద్ధం చేస్తా’’అంటూ మట్టిలో పాతిపెట్టిన ఓ కవర్‌ను బయటకు తీయడం ఇందులో కనబడింది. ఆ తర్వాత దానిని ఉడకించినట్లు కనిపించింది. ఈ వీడియోపై జంతుప్రేమికులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ‘‘మరీ ఇంత నీచంగా ప్రవర్తిస్తారా. అసలు మీరు మనిషేనా. చచ్చిపోయిన పిల్లిని కూడా వదలరా. ఛీఛీ.. ఇంతటి ఘోరాన్ని మేం చూడలేం’’ అంటూ బ్యాంక్స్‌కు చురకలు అంటించారు. ఈ క్రమంలో ఆమె వీడియోను డిలీట్‌ చేసింది.

మరిన్ని వార్తలు