పింక్‌ వజ్రానికి రికార్డ్‌ ధర.. రూ.480 కోట్లకు వేలం

8 Oct, 2022 15:55 IST|Sakshi

హాంకాంగ్‌: అరుదుగా లభించే గులాబీ(పింక్‌) వజ్రాన్ని వేలం వేయగా రికార్డ్‌ స్థాయిలో ధర పలికింది. గులాబీ రంగులో ధగ ధగా మెరిసిపోతున్న ఈ వజ్రాన్ని శుక్రవారం హాంకాంగ్‌లో వేలం వేశారు. ఈ వేలంలో 58 మిలియన్‌ డాలర్లు(రూ.480 కోట్ల) ధర పలికింది. క్యారెట్‌ పరంగా వేలంలో ఈ స్థాయి అత్యధిక ధర పలకడం ప్రపంచ రికార్డు.

11.15 క్యారెట్లు ఉన్న ఈ విలియమ్సన్‌ పింక్‌ స్టార్‌ డైమండ్‌ అంచనా ధర 21 మిలియన్‌ డాలర్లు(రూ.173.5 కోట్లు) కాగా, రెట్టింపు ధరను మించి పలికింది. ప్రముఖ సంస్థ ‘సదబీస్‌’ దీన్ని వేలం వేసింది. రెండు ప్రపంచ ప్రఖ్యాత పింక్‌ వజ్రాల వరుసలో ఈ వజ్రానికి ‘విలియమ్సన్‌ పింక్‌ స్టార్‌ డైమండ్‌’ అనే పేరు వచ్చింది. 23.60 క్యారెట్ల మొదటి విలియమ్సన్‌ డైమండ్‌ను తన వివాహ వేడుకలో (1947) బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2 కానుకగా అందుకొన్నారు. 59.60 క్యారెట్ల రెండో పింక్‌ స్టార్‌ డైమండ్‌ 2017 వేలంలో రూ.588 కోట్ల (71.2 మిలియన్‌ డాలర్లు) రికార్డు ధరకు అమ్ముడుపోయింది.

ఇదీ చదవండి:  15 నిమిషాల రైడ్‌కు రూ.32 లక్షలు ఛార్జ్‌ చేసిన ఉబర్‌

మరిన్ని వార్తలు