12 అంతస్తుల భవనం.. క్షణాల్లో నేలమట్టం

5 Jul, 2021 20:03 IST|Sakshi

24 మంది మృతి.. 121 మంది గల్లంతు

వాషింగ్టన్‌: అమెరికాలోని దక్షిణ ఫ్లోరిడాలో  జరిగిన ఘోర ప్రమాదంలో ఇప్పటి వరకు 24 మంది మృతదేహాలను వెలికితీశారు. గల్లంతైన 121 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.. అయితే ప్రస్తుతం ఉత్తర మియామీ సమీపంలోని 12 అంతస్తుల నివాస భవనం జూన్ 24 తెల్లవారుజామున కూలిపోగా.. 2021, జూలై 4న  పాక్షికంగా కూలిపోయిన భవనాన్ని బాంబుల సాయంతో అక్కడి సిబ్బంది కూల్చివేశారు. ఇందుకోసం చుట్టుపక్కల ఇళ్లలోని ప్రజలను ఖాళీ చేయించారు.

ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ 24 మంది మృతదేహాలను వెలికితీశారు. మరో 121 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. ఇక కొన్నేళ్ల క్రితం నిర్మించిన ఈ భవనంలో కొన్ని రోజుల కిందట పగుళ్లు గుర్తించినట్లు స్థానిక ఇంజనీర్లు చెబుతున్నారు. వాటికి మరమ్మతులు చేయాల్సి ఉండగా, ఈలోగా ప్రమాదం జరిగింది. కాగా, వచ్చే వారంలో ఎల్సా తుపాను వచ్చే అవకాశం ఉండటంతో.. సర్ఫ్‌సైడ్‌లోని మిగిలిన 12-అంతస్తుల చాంప్లైన్ టవర్స్ సౌత్‌ను అక్కడి కాలమానం ప్రకారం.. ఆదివారం రాత్రి 10:30 తర్వాత కూల్చివేశారు. 

తుపాను ముప్పు
కాగా, చాంప్లైన్ సౌత్ టవర్ కూల్చివేతను చూడటానికి పెద్ద మొత్తంలో  ప్రజలు అక్కడి చేరుకున్నారు. ఈ ఘటనపై కౌంటీ మేయర్ లెవిన్ కావా మాట్లాడుతూ.. ఉష్ణమండల తుఫాను ఎల్సా కరేబియన్ మీదుగా ఉత్తరం వైపు  వస్తుండటంతో.. అధికారులు బిల్డింగ్‌ కూల్చివేత షెడ్యూల్‌ను వేగవంతం చేశామని తెలిపారు.. గతవారం ప్రెసిడెంట్ జో బైడెన్  ఈ ప్రాంతాన్ని సందర్శించి బాధితుల బంధువులను ఓదార్చారు. అంతే కాకుండా రెస్క్యూ కార్మికులను కలుసుకుని వారి పనితీరుని ప్రశంసించారు.
 

మరిన్ని వార్తలు