-

వెలుగులోకి కొత్త కరోనా.. కుక్కలనుంచి మనుషులకు!

21 May, 2021 19:26 IST|Sakshi

వాషింగ్టన్‌ : కరోనా బారిన పడి కొన్ని దేశాలు గిలగిల్లాడుతున్నాయి. మరికొన్ని దేశాలు ఇప్పుడిప్పుడే కోలుకుని మామూలు స్థితిలోకి వస్తున్నాయి. కానీ, కరోనా భయంనుంచి పూర్తిగా బయట పడలేకుండా ఉన్నాయి. ప్రపంచంలో ఏదో ఓ మూల కరోనా వైరస్‌ కొత్త రూపంలో దర్శనమిస్తోంది. తాజాగా, ఓ కొత్త కరోనా వైరస్‌ వెలుగులోకి వచ్చింది. అమెరికాలోని డ్యూక్‌ యూనివర్శిటీకి చెందిన డాక్టర్‌ గ్రేగరీ గ్రే, అతడి శిష్యుడు లేషన్‌ క్ష్యూ ఈ కొత్త వైరస్‌ను కనుగొన్నారు. ఈ వైరస్‌ కుక్కల నుంచి మనుషులకు వ్యాప్తి చెందినట్లు గుర్తించారు. గురువారం ప్రచురితమైన క్లినికల్‌ ఇన్‌ఫెక్షస్‌ డిసీజెస్‌ జర్నల్‌లో ఈ వివరాలను వెల్లడించారు. మలేషియాలోని సెరవాక్‌ ఆసుపత్రి రోగుల నుంచి 2017, 2018 సంవత్సరాలలో కొన్ని శాంపిళ్లను సేకరించారు.

వీటిని పరీక్షించగా కొత్త కరోనా వైరస్‌ కంటపడింది. ఈ కొత్త కరోనా వైరస్‌ బారిన పడిన వారిలో నిమోనియా ఉన్నట్లు వారు గుర్తించారు. ఈ వైరస్‌ ప్రభావం పిల్లలపై ఎక్కువగా ఉందని తెలిపారు. 301 శాంపిళ్లలో కేవలం ఎనిమిది మందిలో మాత్రమే ఈ కొత్త కరోనా వైరస్‌ లక్షణాలు కనిపించాయి. ఈ శాంపిళ్లను స్క్రీనింగ్‌ టెస్టుకు పంపగా వాటిలో కొత్త కరోనా వైరస్‌ ఉన్నట్లు నిర్థారణ అయింది. అయితే, ఈ వైరస్‌ మనుషుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందుతుందా లేదా.. అసలు వారికి ఈ వైరస్‌ ఎలా సోకింది అన్నది స్పష్టం కాలేదు. అదే విధంగా ఈ వైరస్‌ నుంచి మనుషులకు ఎంత వరకు ప్రమాదం ఉందన్న సంగతి కూడా తేలలేదు. 

మరిన్ని వార్తలు