రిషి సనాన్ తగ్గేదేలే.. సర్వేలపై పరోక్షంగా పంచ్‌లు.. ప్రధాని రేసులో అండర్‌డాగ్‌

23 Jul, 2022 19:01 IST|Sakshi

 లండన్‌: బ్రిటన్ ప్రధాని పదవికి పోటీ పడుతున్న భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ ఈ రేసులో తనను తాను అండర్‌డాగ్‌గా అభివర్ణించుకున్నారు.  కచ్చితంగా తాను గట్టి పోటీ ఇస్తానని పేర్కొన్నారు. కొన్ని శక్తులు తనతో పోటీపడుతున్న వ్యక్తికి పట్టాభిషేకం జరగాలని కోరుకుంటున్నాయని, కానీ నిర్ణయం టోరీ(కన్జర్వేటివ్ పార్టీ) సభ్యుల చేతుల్లో ఉంటుందని చెప్పారు. ఎవర్ని గెలిపించాలో నిర్ణయించుకునేందుకు వారికి ఇంకా చాలా సమయం ఉందని వ్యాఖ్యానించారు.

రిషి సనాక్‌తో పోటీ పడుతున్న లిజ్ ట్రస్‍కే టోరీ సభ్యులు పట్టం గడుతున్నారని యూగో సర్వే గురువారం వెల్లడించింది. రిషిపై ట్రస్ 24 శాతం పాయింట్ల లీడ్‌లో ఉన్నట్లు ఆ పోల్ అంచనా వేసింది. దీనిపై పరోక్షంగా స్పందిస్తూ తాను అండర్‌డాగ్‌నని చెప్పారు రిషి. సెంట్రల్ ఇంగ్లండ్ గ్రాంథమ్‌లో శనివారం ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

బ్రిటన్ ప్రధాని రేసులో భాగంగా రిషి, ట్రస్ నిర్వహిస్తున్న ప్రచారంలో ప్రధానంగా పన్ను కోతలు, రక్షణ వ్యయం గురించే మాట్లాడుతున్నారు. తనను గెలిపిస్తే 2030 నాటికి రక్షణ వ్యయాన్ని జీడీపీలో 3 శాతానికి పెంచుతానని ట్రస్ ప్రకటించారు. రిషి మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆర్థిక నిర్వహణే అన్నింటికంటే ముఖ్యమని, ఆ తర్వాత పన్ను రాయితీలని పేర్కొన్నారు. తాను అధికారం చేపట్టిన వెంటనే ఆర్థిక వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు చర్యలు చేపడతానని చెప్పారు.
చదవండి: లక్ అంటే ఇదే.. తల్లి సలహాతో జాక్‌పాట్ కొట్టిన మహిళ.. లాటరీలో కోట్లు!

మరిన్ని వార్తలు