-

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సునాక్‌దే పైచేయి 

19 Oct, 2022 01:53 IST|Sakshi

ప్రధాని ట్రస్‌పై పెరిగిన వ్యతిరేకత 

యూగవ్‌ గ్యాలప్‌ సర్వేలో వెల్లడి 

లండన్‌: బ్రిటన్‌ ప్రధానమంత్రి పదవికి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రధాని లిజ్‌ ట్రస్‌పై భారత సంతతి మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌ విజయం ఖాయమని ఓ సర్వేలో వెల్లడైంది. యూగవ్‌ తాజాగా నిర్వహించిన గ్యాలప్‌ పోల్‌లో అధికార కన్జర్వేటివ్‌ పార్టీ సభ్యుల్లో కేవలం 25 శాతం మంది మాత్రమే మళ్లీ ట్రస్‌కు ఓటేస్తామన్నారు. రిషి వైపు 55% మంది మొగ్గు చూపారు.

పన్నుల్లో కోత పెట్టి, వివాదాస్పదం కావడంతో వాటిని ఉపసంహరించుకున్న లిజ్‌ట్రస్‌ నాయకత్వంపై విమర్శలు చెలరేగుతున్న వేళ ఈ సర్వే చేపట్టారు. ప్రధాని పదవికి, పార్టీ నాయకత్వ పదవికి రాజీనామా చేయాలని 55 శాతం మంది కోరుకుంటుంటుండగా, కొనసాగాలని 38% మంది మాత్రమే కోరుకోవడం గమనార్హం. పార్టీ గేట్‌ కుంభకోణంతో తప్పుకున్న మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ను సరైన ప్రత్యామ్నాయంగా 63 శాతం మంది పేర్కొనడం విశేషం. ప్రధానిగా జాన్సన్‌ను 32%, రిషిని 23 శాతం బలపరిచారు.

తప్పులు చేశాం..క్షమించండి: లిజ్‌ ట్రస్‌ 
ప్రధాని లిజ్‌ట్రస్‌ తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదం కావడంతోపాటు, దేశ ఆర్థిక వ్యవస్థను మరింత ఇబ్బందుల్లో నెట్టాయి. సొంత పార్టీ సభ్యుల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆమె తొలిసారిగా స్పందించారు. ‘మేం తప్పులు చేశామని గుర్తించాను. ఆ తప్పిదాలకు నన్ను క్షమించండి. ఇప్పటికే ఆ తప్పులను సరిచేసుకున్నాను. కొత్త ఆర్థిక మంత్రిని నియమించాను.

ఆర్థిక స్థిరత్వం, క్రమశిక్షణను పునరుద్ధరించాం’అని అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు పార్టీ నేతగా కొనసాగుతానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నెల 24వ తేదీలోగా ఆమెపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు పాలక కన్జర్వేటివ్‌ పార్టీకి చెందిన 100 మంది సభ్యులు యోచిస్తున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆమె పై వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఇదీ చదవండి: రష్యా కొత్త పంథా.. ఉక్రెయిన్‌ ఉక్కిరిబిక్కిరి   

మరిన్ని వార్తలు