వృద్ధులకు కరోనా ముప్పు

10 Sep, 2021 04:40 IST|Sakshi

వాషింగ్టన్‌: కరోనా వ్యాక్సిన్‌ తీసుకుంటే మహమ్మారి నుంచి ముప్పు తప్పినట్లేనని ఇన్నాళ్లూ భావించాం. కానీ, తాజాగా అమెరికాకు చెందిన సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీఎస్‌) నిర్వహించిన అధ్యయనంలో టీకా రెండు డోసులు తీసుకున్నప్పటికీ వయసు మీద పడిన వారిలో కరోనా ముప్పు అధికంగా ఉంటున్నట్లు తేలింది. అనారోగ్యంతో బాధపడే వృద్ధులకు కరోనా సోకితే వ్యాక్సిన్‌ తీసుకున్నా పెద్దగా ప్రయోజనం ఉండడం లేదని ఈ అధ్యయనం వెల్లడించింది.

గత ఎనిమిది నెలల్లో  రెండు డోసులు తీసుకున్నాక కూడా ఆస్పత్రి పాలైన వారు, లేదంటే  ప్రాణాలు కోల్పోయిన వారు 12,908 వరకు ఉన్నారని తెలిపింది. ఆస్పత్రిలో చేరిన వారిలో 70 శాతానికి పైగా మంది 65 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారే. ఇక కరోనాతో మృతి చెందిన వారిలో 87 శాతం మందికి పైగా 65 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసు ఉన్నావారే. సీడీసీ తాజాగా కరోనా కేసుల తీరు తెన్నుల్ని, వివిధ రాష్ట్రాల్లో నమోదైన కేసులను క్షుణ్నంగా అధ్యయనం చేసింది.

మరిన్ని వార్తలు