ఉక్రెయిన్‌పై ఇరాన్‌ డ్రోన్‌ బాంబులు.. 8 మంది మృతి

18 Oct, 2022 08:50 IST|Sakshi

కీవ్‌: వారాంతం ముగిసి సోమవారం విధుల్లోకి వెళ్లే ఉద్యోగులతో బిజీగా మారిన ఉక్రెయిన్‌ రాజధానిని రష్యా డ్రోన్లు చుట్టుముట్టాయి. ఆత్మాహుతి బాంబర్లుగా మారి బాంబుల వర్షం కురిపించాయి. దీంతో బాంబు శబ్దాల హోరుతో కీవ్‌ దద్దరిల్లింది. ప్రాణభయంతో జనం సమీప సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. బాంబుల ధాటికి పలు భవనాలు నేలమట్టమయ్యాయి. కొద్దిరోజులుగా కీవ్‌పై దాడి ఎక్కుపెట్టిన రష్యా వైమానిక దళం దెబ్బకు రాజధాని ప్రజలు నిరంతరం ఆకాశం వైపు చూస్తూ భయంభయంగా బయట సంచరిస్తున్నారు. గతంలో క్షిపణి దాడులకు దిగిన రష్యా బలగాలు ఈసారి ఇరాన్‌ తయారీ షహీద్‌(జెరాన్‌–2) డ్రోన్లకు పనిచెప్పాయి. కీవ్‌లో ధ్వంసమైన ఒక భవంతి శిథిలాల నుంచి 18 మందిని ఉక్రెయిన్‌ సేనలు సురక్షితంగా కాపాడాయి. 

డ్రోన్ల దాడిలో కీవ్‌లో ఓ గర్భిణి, ఆమె భర్త సహా మొత్తం నలుగురు, సుమీ ప్రాంతంలో మరో నలుగురు కలిపి మొత్తం 8 మంది మరణించారు. ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా యుద్ధ విమానం కూలిపోయి నలుగురు మృతి చెందిన క్రమంలో ఈ దాడులు చేసినట్లు సమాచారం. డ్రోన్ల దాడిని ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా ఖండించారు. రష్యాకు డ్రోన్లు అందిస్తున్న ఇరాన్‌పై ఆంక్షలు విధించాలను యూరోపియిన్‌ యూనియన్‌ను కోరారు.

ఇదీ చదవండి: పుతిన్‌ వార్నింగ్‌ని బేఖాతారు చేస్తూ..నాటో సైనిక కసరత్తులు

మరిన్ని వార్తలు