అమెరికా అధ్యక్షుడు బైడెన్
వాషింగ్టన్: ఉక్రెయిన్ విషయంలో రష్యా నాయకత్వం తీరుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్పై దాడి కేవలం ఆ ఒక్క దేశంపైన జరుగుతున్న దాడి కాదని.. మొత్తం ఐరోపా ఖండం భద్రత, ప్రపంచ శాంతి, స్థిరత్వంపై జరుగుతున్న దాడేనని తేల్చిచెప్పారు. ‘నాటో’ సభ్యదేశాల రక్షణకు అమెరికా కట్టబడి ఉన్నట్లు పునరుద్ఘాటించారు. శ్వేతసౌధంలో ఫిన్లాండ్ అధ్యక్షుడు సౌలీ నీనిస్ట్తో బైడెన్ భేటీ అయ్యారు.
ఉక్రెయిన్–రష్యా యుద్ధం, రష్యాపై ఆంక్షలు, వాతావరణ మార్పులు, నాటో ఓపెన్ డోర్ పాలసీ తదితర అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఈ సందర్భంగా బైడెన్ మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్లో సాగుతున్న రక్తపాతానికి రష్యాను జవాబుదారీగా చేసే విషయంలో ఇరుదేశాలు ఒకేతాటిపై ఉన్నాయని తెలిపారు. జో బైడెన్ తాజాగా పోలండ్ అధ్యక్షుడు అండ్రెజ్ డుడాతో ఫోన్లో మాట్లాడారు. ఉక్రెయిన్పై దండెత్తుతున్న రష్యా పట్ల తమ ప్రతిస్పందన ఎలా ఉండాలన్న దానిపై వారిద్దరూ చర్చించుకున్నట్లు వైట్హౌస్ తెలిపింది.