ఉక్రెయిన్‌ నుంచి భారతీయుల తరలింపు.. బుకారెస్ట్ చేరుకున్న ఎయిరిండియా

26 Feb, 2022 11:34 IST|Sakshi

ఉక్రెయిన్‌పై రష్యా బాంబు వర్షం కొనసాగుతూనే ఉంది. ఆ దేశ రాజధాని కీవ్‌పై బాంబలు మిస్సైల్స్‌తో రష్యన్‌ దళాలు విరుచుకుపడుతున్నాయి. దీంతో ఉక్రెయిన్‌లో  చిక్కుకపోయిన భారతీయ విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ప్రమాదక ప్రదేశాల్లో ఉన్నవారంతా బాంబ్‌ షెల్టర్స్‌, అండర్‌ గ్రౌండ్‌ మెట్రో స్టేషన్లు, బంకర్‌లలో తలదాచుకుంటున్నారు. కంటిమీద కునుకు లేకుండా ప్రాణాలు అరచేతిలో పట్టుకుని స్వదేశానికి చేరుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.

అయితే భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు విదేశాంగ శాఖ సైతం చర్యలను వేగవంతం చేసింది. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను తీసుకొచ్చేందుకు 4 ఎయిరిండియా విమానాలను నడుపుతోంది. ఉక్రెయిన్‌లోని 470 మంది భారతీయ విద్యార్థులు నేడు భారత్‌ చేరుకోనున్నారు. ముందుగా భారతీయులను ఉక్రెయిన్ సరిహద్దులైన రొమేనియా, హంగరీ ప్రాంతాలకు తరలించారు. రొమేనియా రాజధాని బుకారెస్ట్‌కు చేరుకొని ఎయిరిండియా విమానాల్లో భారత్‌కు బయల్దేరనున్నారు. 
చదవండి: యుద్ధం ప్రత్యక్ష ప్రభావం భారత్‌పై ఎలా ఉండబోతుంది? పూర్తి వివరాలు

ఇప్పటికే ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకురావడానికి ముంబై నుంచి వెళ్లిన ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానం AI-1943 రొమేనియా రాజధాని బుకారెస్ట్‌కు చేరుకుంది. ఈ విమానం సాయంత్రం 4 గంట‌ల‌కు ముంబైలోని ఛ‌త్ర‌ప‌తి శివాజీ టెర్మిన‌ల్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టుకు చేరుకోనుంది. ఉక్రెయిన్ నుంచి వ‌చ్చే ఈ విద్యార్థుల‌కు కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్ స్వాగ‌తం ప‌లుక‌నున్నారు. మరో రెండు విమనాలను రొమేనియా సరిహద్దు వద్దకు, ఒకటి హంగేరికి పంపనుంది. 

ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకపోయిన భారత పౌరులకు కీవ్‌లోని భారత రాయబార కార్యాలయం కీలక సూచన చేసింది. సరిహద్దు పోస్టుల వద్ద ఉన్న భారత అధికారులతో ముందస్తు సమన్వయం లేకుండా ఉక్రెయిన్ సరిహద్దు పోస్టుల వద్దకు వెళ్లవద్దని సూచించింది. ‘వివిధ సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద పరిస్థితి చాలా సున్నితంగా ఉంది. భారతీయ పౌరులనును సమన్వయంతో తరలించడానికి  పొరుగు దేశాలలోని భారత రాయబార కార్యాలయాలతో ఎంబసీ నిరంతరం పని చేస్తోంది. అధికారులతో సమన్వయం లేకుండా ఎవరూ సరిహద్దూలకు రావొద్దు’ అని ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం శనివారం ఉదయం ట్వీట్ చేసింది.

మరిన్ని వార్తలు