Russia-Ukraine war: రష్యా ధ్వంస రచన

26 Apr, 2022 05:52 IST|Sakshi
రష్యాలోని బ్రియాన్‌స్క్‌ నగరంలో ఆయిల్‌ డిపోలో చెలరేగుతున్న మంటలు

ఉక్రెయిన్‌లో రైల్వే ఆఫీసులు, చమురు కేంద్రాలపై క్షిపణుల వర్షం

కీవ్‌/మారియూపోల్‌: ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులకు దిగుతోంది. దేశంలో మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తోంది. తూర్పు ప్రాంతంలోని రైల్వే కార్యాలయాలు, చమురు కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని రష్యా సైన్యం సోమవారం క్షిపణుల వర్షం కురిపించింది. పశ్చిమ ప్రాంతంలోనూ రెండు చమురు కేంద్రాలపై దాడికి దిగింది. మధ్య, పశ్చిమ ఉక్రెయిన్‌లో ఐదు రైల్వే కార్యాలయాలపై దాడులు చేసింది. క్రెమెన్‌చుక్‌లోని చమురు శుద్ధి కర్మాగారాన్ని ధ్వంసం చేశాయి. రష్యా యుద్ధ విమానాలు ఆదివారం రాత్రి 56 చోట్ల దాడులకు పాల్పడినట్లు ఉక్రెయిన్‌ చెప్పింది.

రష్యా ఆయిల్‌ డిపోలో మంటలు
ఉక్రెయిన్‌ సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో రష్యా నగరం బ్రియాన్‌స్క్‌లో ఆయిల్‌ డిపోలో సోమవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. దానికి కారణాలు తెలియరాలేదు. ఈ అయిల్‌ డిపో నుంచి యూరప్‌కు పైప్‌లైన్‌ ద్వారా ముడి చమురు సరఫరా అవుతూంటుంది.

పశ్చిమ దేశాల కుట్రలు సాగవు: పుతిన్‌  
తమ సమాజాన్ని విచ్ఛిన్నం చేసేందుకు అమెరికా, దాని మిత్రదేశాలు కుట్ర పన్నుతున్నాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ ఆరోపించారు. రష్యాను అంతర్గతంగా ధ్వంసం చేసేందుకు పశ్చిమ దేశాలు సాగిస్తున్న ప్రయత్నాలు ఫలించబోవన్నారు. యుద్ధ పరిస్థితిపై సోమవారం ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు.

ఆ బాలలకు ఈస్టర్‌ బహుమతులు
మారియూపోల్‌లోని అజోవ్‌స్టల్‌ స్టీల్‌ప్లాంట్‌ బంకర్‌లో క్షణమొక యుగంలా గడుతుపున్న ఉక్రెయిన్‌ బాలల ముఖాల్లో ఈస్టర్‌ బహుమతులు వెలుగులు నింపాయి. ఉక్రెయిన్‌ సైన్యం వారికి బహుమతులు అందించింది. మరోవైపు నాటో సభ్యత్వం కోసం స్వీడన్, ఫిన్‌లాండ్‌ మే 22 తర్వాత దరఖాస్తు సమర్పించనున్నాయి. ఐరాస సెక్రెటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ సోమవారం టర్కీలో పర్యటించారు. ఆయన మంగళవారం రష్యా వెళ్లి పుతిన్‌తో సమావేశమవుతారు. 28న ఉక్రెయిన్‌కు వెళ్తారు.  రష్యా ప్రభుత్వం 40 మంది జర్మనీ దౌత్య అధికారులను తమ దేశం నుంచి బహిష్కరించింది.

మరిన్ని వార్తలు