ఎర్ర ఉల్లిపాయల్లో సాల్మొనెల్లా బ్యాక్టీరియా

6 Aug, 2020 17:11 IST|Sakshi

వాషింగ్టన్‌: మన దగ్గర ఉల్లి వాడకం లేని ఇళ్లు చాలా అరుదు. కూర, పులుసు, రసం.. చివరకు మజ్జిగలోకి కూడా ఉల్లిపాయ నంజుకు కావాలి చాలా మందికి. ఇది మనదేశంలో పరిస్థితి. కానీ ఇప్పుడు అమెరికన్లు  ఉల్లి పేరు వింటే చాలు.. గజగజ వణికిపోతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం అమెరికాలో ఉల్లిపాయలు ఓ భయంకరమైన వ్యాధిని కలిగిస్తున్నాయట. దీని గురించి  స్వయంగా అమెరికా అంటువ్యాధుల నియంత్రణ సంస్థ(సీడీసీ) వెల్లడించింది. గత కొద్ది రోజులుగా అమెరికా, కెనడాలో సాల్మొనెల్లా(ఫుడ్‌ పాయిజన్‌ కలిగించే బ్యాక్టీరియా) మహమ్మారి కేసులు ఎక్కువగా వెలుగు చేస్తున్నాయంట. ఇప్పటి వరకు మొత్తం 34 రాష్ట్రాల్లో 400 మందికి ఈ బ్యాక్టీరియా సోకినట్లు అధికారులు వెల్లడించారు. సాల్మొనెల్లా ప్రధానంగా పొట్టలోని పేగులపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా డయేరియా (విరేచనాలు), జ్వరం, కడుపు నొప్పి వంటివి వస్తాయి. (రక్తపు వాంతులు, జుట్టంతా రాలిపోయి..)

ఇది ఒక్కొక్కరిలో ఆరు గంటలపాటూ ఉంటుంది. బ్యాక్టీరియా సోకిన ఆరు గంటల తర్వాత ఈ అనారోగ్య సమస్యలు వస్తాయి. కొందరిలో ఆరు రోజుల తర్వాత కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయంటున్నారు అధికారులు. అమెరికా, కెనడాకు నౌకల్లో వెళ్లిన ఎర్ర ఉల్లిపాయల్లో ఈ సాల్మొనెల్లా బ్యాక్టీరియా చేరిందని అభిప్రాయపడుతున్నారు. ఈ ఉల్లిపాయలు... అమెరికాలోని 50 రాష్ట్రాలతోపాటూ, కెనడాలోని అన్ని సూపర్ మార్కెట్లు, రెస్టారెంట్లకు ఆగస్ట్ 1న సప్లై అయ్యాయి. వీటిలో ఎరుపు, పసుపు, తెలుపు, తీపి పసుపు రంగు ఉల్లిపాయలున్నాయి. వీటన్నింటిలో కన్నా కూడా ఎర్ర ఉల్లిపాయల్లో ఎక్కువగా సాల్మొనెల్లా వైరస్ ఉన్నట్లు గుర్తించింది సీడీసీ. థాంప్సన్ ఇంటర్నేషనల్ కంపెనీ నుంచి వచ్చిన అన్ని రకాల ఉల్లిపాయలనూ వాడవద్దని సీడీసీ జనాలను హెచ్చరించింది. (చైనాను వ‌ణికిస్తున్న మ‌రో మాయ‌దారి వైర‌స్‌)
 

సాల్మొనెల్లా లక్షణాలు
సాల్మొనెల్లా బ్యాక్టీరియా సోకిన వారిలో వెంటనే లక్షణాలు కనిపించవు. 8 గంటల నుంచి 72 గంటల తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఇవి 4 రోజుల నుంచి 7 రోజుల పాటూ ఉంటాయి. డయేరియా, జ్వరం, కడుపు నొప్పి, వికారం, వాంతులు, తలనొప్పి వంటివి వస్తాయి. చాలా మంది డాక్టర్ల దగ్గరకు వెళ్లకుండానే రికవరీ అవుతారు. ముసలి వాళ్లు, పిల్లలకు ఈ సమస్య వస్తే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లడమే మేలు. సాల్మొనెల్లో సోకితే... ఎక్కువ నీరు తాగాలి.

మరిన్ని వార్తలు