శామ్‌సంగ్‌కు 75 కోట్ల జరిమానా

24 Jun, 2022 04:59 IST|Sakshi

మెల్‌బోర్న్‌: ప్రముఖ ఎలక్ట్రానిక్‌ కంపెనీ శామ్‌సంగ్‌కు ఆస్ట్రేలియా ఫెడరల్‌ కోర్టు ఝలకిచ్చింది. మొబైల్‌ ఫోన్లు వాటర్‌ ప్రూఫ్‌ అంటూ తప్పుదోవ పట్టించినట్లు వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపిన కోర్టు శామ్‌సంగ్‌కు రూ.75 కోట్ల మేర జరిమానా విధించిందని ప్రభుత్వ నియంత్రణ సంస్థ వెల్లడించింది.

2016 మార్చి నుంచి 2018 అక్టోబర్‌ మధ్య ఎస్‌7, ఎస్‌8 సిరీస్‌ చెందిన 31 లక్షల గ్యాలెక్సీ ఫోన్లను శామ్‌సంగ్‌ ఆస్ట్రేలియా విక్రయించింది. ఈ ఫోన్లు నీళ్లలో తడిచినా పాడవవంటూ ప్రకటనలు ఇచ్చింది. అయితే, నీళ్లలో తడిచిన తర్వాత తమ ఫోన్లు పనిచేయడం లేదంటూ వందలాదిగా వినియోగదారులు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి 2019లో నమోదైన కేసులపై కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. సంబంధిత ఫోన్లను కొనుగోలు చేసిన వినియోగదారులు శామ్‌సంగ్‌ను సంప్రదించాలని సూచించింది.  
 

మరిన్ని వార్తలు