ఇరాన్‌ శాస్త్రవేత్త హత్య: రియాద్‌ పాత్రను ఖండించిన సౌదీ!

2 Dec, 2020 20:26 IST|Sakshi

రియాద్‌ : ఇరాన్‌కు చెందిన‌ ప్రముఖ అణు శాస్త్రవేత్త  మొహ్‌సేన్‌ ఫక్రీజాదే హత్యలో రియాద్‌ పాత్ర ఉందంటూ ఇరాన్‌ విదేశాంగ  మంత్రి చేసిన వ్యాఖ్యలపై సౌదీ సీనియర్‌ మంత్రి మంగళవారం విరుచుకుపడ్డారు. ఇరాన్‌లో జరిగే ప్రతికూలతలు ఇరాన్‌ విదేశాంగ మంత్రి జరీఫ్‌ , సౌదీని నిందించడానికి తగదని సౌదీ విదేశాంగ మంత్రి అదెల్‌ అల్‌ జుబీర్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇరాన్‌లో భూకంపం, వరదలకు కూడా తమనే నిందించేలా ఉన్నారని  ఎద్దేవా చేశారు. హత్యలకు పాల్పడటం సౌదీ అరేబియా విధానం కాదని ఆయన తెలిపారు. 

ఇరాన్‌, దాని శత్రువుల మధ‍్య ఉద్రిక్తతలు పెరగడంతో రాజధాని టెహ్రాన్‌ వెలుపల  శుక్రవారం జరిగిన బాంబు దాడిలో ఫఖ్రిజాదే మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఇరాన్‌  విదేశాంగ  మంత్రి మొహమ్మద్‌ జువాద్‌ జరీఫ్‌ సోమవారం  ఇన్‌స్టాగ్రామ్‌లో సౌదీ అరేబియా క్రౌన్‌ ప్రిన్స్‌ మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌, ఇజ్రయెల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహుల మధ్య రహస్య సమావేశం  జరిగిన  తర్వాత ఈ హత్య జరిగిందని ఆరోపించింది. ఇతర గల్ఫ్‌ దేశాల  మాదిరిగా  కాకుండ, సౌదీ అరేబియా-షియా శక్తి ఇరాన్‌తో  దశాబ్దాల నాటి శత్రుత్వంతో ఉంది.

గత నెలలో, నెతన్యాహు సౌదీ అరేబియాలో క్రౌన్‌ ప్రిన్స్‌ మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌తో చర్చలు జరిపినట్లు  మీడియా, ఇజ్రాయెల్‌ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
నెతన్యాహు మొసాద్‌ గూడాచారి ఏజెన్సీ చీఫ్‌ యోసేఫ్‌ మీర్‌ కోహెన్‌, ప్రిన్స్‌ మొహమ్మద్‌తో పాటు అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్‌  పాంపీతో కలిసి నియోమ్‌లో సమావేశమయ్యారని సారాంశం. అయితే అలాంటి సమావేశం జరగలేదని రియాద్‌ ఖండించింది.

సౌదీ అరేబియాకు ఇజ్రాయెల్‌తో అధికారిక దౌత్య సంబంధాలు లేవు కానీ, ఇరాన్‌పై  ఉన్న శత్రుత్వం ఆధారంగా ఇరువర్గాల  సంబంధాలను  పెంచుకుంటున్నాయి.
ఫఖ్రిజాదేపై  దాడి వెనుక ఇజ్రాయెల్‌ ఉందంటూ అమెరికన్‌ అధికారితో పాటు, మరో ఇద్దరు ఇంటలిజెన్స్‌ అధికారులు ధ్రువీకరించారని ఇండియా టైమ్స్‌  తెలిపింది. శాస్త్రవేత్తను హతమార్చడం ద్వారా ఇజ్రాయెల్‌లో గందరగోళాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తోందని ఇరాన్‌  అధ్యక్షడు హసన్‌ రౌహాని ఆరోపించారు. అయితే తన దేశం ఉచ్చులో పడదని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు