ఆసక్తికర విషయాలు వెల్లడించిన బ్రిటన్‌ పరిశోధకులు

15 Sep, 2020 09:52 IST|Sakshi

శుక్రగ్రహం మీద ఫాస్ఫైన్‌ ఉన్నట్లు వెల్లడి

లండన్‌: అనంత విశ్వంలో భూమి లాంటి గ్రహాలు ఉన్నాయా.. సూదూరాన ఇంకా ఎక్కడైనా జీవులు మనగల అవకాశం ఉందా అనే విషయం గురించి తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఎడతెరపి లేని ప్రయోగాలు చేస్తుంటారు. అరుణ గ్రహం, చంద్రుడి మీద జీవం మనగడకు గల అవకాశాలను తెలుసుకునేందుకు ప్రయోగాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వెల్లడైన కొన్ని కథనాలు శుక్రుడి మీద జీవం ఉండేందుకు ఆస్కారం ఉన్నట్లు తెలుపుతున్నాయి. శుక్రుడిపై ఉన్న దట్టమైన మేఘాల్లో ఫాస్పైన్‌ అణువులు ఉన్నట్టు బ్రిటన్‌లోని కార్డిఫ్‌ యూనివర్సిటీ పరిశోధకులు సోమవారం వెల్లడించారు. సాధారణంగా ఆక్సిజన్‌ లేని ప్రాంతంలో నివసించే సూక్ష్మజీవులు ఫాస్పైన్‌ను విడుదల చేస్తాయి. శుక్రుడిపై ఫాస్పైన్‌ ఉందంటే.. సూక్ష్మజీవులు కూడా ఉండవచ్చని భావిస్తున్నారు. నిపుణుల బృందం చిలీలోని అటాకామా ఎడారిలోని టెలిస్కోప్‌లను ఉపయోగించి శుక్రగ్రహం ఉపరితం నుంచి 60 కిలోమీటర్ల దూరంలోని క్లౌడ్‌ డెక్‌ను పరిశీలించారు. ఈ క్రమంలో వీరు ఫాస్ఫైన్‌‌ ఉనికిని గుర్తించారు. భూమి మీద ఇది సేంద్రీయ పదార్థాల విచ్ఛిన్నం నుంచి లభిస్తుంది. పాస్ఫైన్‌కు మండే స్వభావం ఉంటుంది. (చదవండి: వందేళ్లలో ఈ ‘అగ్ని వలయం’ లోతైనది!)

అయితే మరొ కొందరు శాస్త్రవేత్తలు మాత్రం పాస్ఫిన్‌ ఉన్నంత మాత్రాన జీవం ఉండగలని చెప్పలేమంటున్నారు. ఈ సందర్భంగా కార్డిఫ్ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ ఆస్ట్రానమీకి చెందిన లీడ్ రచయిత జేన్ గ్రీవ్స్ ఏఎఫ్‌పీతో మాట్లాడుతూ.. ‘ఫాస్ఫైన్ ఉన్నంత మాత్రాన ఆ గ్రహం మీద జీవం ఉందని చెప్పలేం. ఒక గ్రహం మీద భాస్వరం సమృద్ధిగా ఉన్నప్పటికి.. జీవం మనుగడకు సంబంధించిన ముఖ్యమైనది అక్కడ లేకపోవచ్చు. ఇతర మూలకాలు ఉండటం వల్ల అక్కడ పరిస్థితులు చాలా వేడిగా.. పొడిగా ఉండవచ్చు’ అని తెలిపారు. అయితే భూమి కాకుండా వేరే రాతి గ్రహం మీద ఫాస్ఫైన్ కనుగొనడం ఇదే మొదటిసారి అన్నారు గ్రీవ్స్. శుక్ర గ్రహం మీదే ఇంత ఆసక్తి ఎందుకంటే.. ఇది మనకు సమీపంగా ఉండటమే కాక.. పరిమాణంలో భూమికి సమానంగా ఉంటుంది. అంతేకాక గత అధ్యయనాలు ఇక్కడ చురుకైన అగ్ని పర్వతాలు ఉన్నాయని లావా ప్రవాహాల సంకేతాలతో సహా గుర్తించాయి. 

మరిన్ని వార్తలు