తొలి సముద్రతీర భూమి ఏర్పడింది జార్ఖండ్లోని సింఘ్భూమ్లో..
330 నుంచి 320 కోట్ల సంవత్సరాల కిందటే ఇది ఏర్పడిందని అంచనా
250 కోట్ల సంవత్సరాల కిందట ఉపవాయువులు
నదీమార్గాలు, ఇసుకరాళ్లను విశ్లేషించిన పరిశోధకులు
Unknown Facts About World First Beach In Telugu: వందల కోట్ల సంవత్సరాల కిందట లావా చల్లబడి సముద్రాల్లో హెచ్చు తగ్గుల వల్ల భూమి ఏర్పడిందని తెలుసు. కానీ అది ఎక్కడ? ఎప్పుడు? ఎలా? ఏర్పడిందనేది ఇప్పటికీ ఓ నిర్ధారణ లేదు. కానీ ప్రపంచంలో మొట్టమొదటి సముద్రతీర భూమి ఏర్పడింది జార్ఖండ్ ప్రాంతంలోని సింఘ్భూమ్లోనని పరిశోధకులు తేల్చి చెప్పారు. 330 కోట్ల నుంచి 320కోట్ల సంవత్సరాల కిందట ఏర్పడి ఉంటుందని ఇండియా, ఆస్ట్రేలియా, యూఎస్ శాస్త్రవేత్తలు చేసిన సంయుక్త పరిశోధనల్లో వెల్లడైంది. నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్లో ఇటీవల ప్రచురితమైన పేపర్లో ఈ ఆసక్తికరమైన విషయాలను పరిశోధక బృందం వెల్లడించింది.
తేలికైన రసాయనాలు చల్లబడి...
సముద్ర మట్టానికి పైన 330 నుంచి 320 కోట్ల సంవత్సరాల మధ్యకాలంలో ఈ స్థిరమైన ఖండాంతర భూభాగాలు ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు గుర్తిం చారు. భూమికి 35 నుంచి 45 కిలోమీటర్ల లోతులో అగ్నిపర్వతాల నుంచి విడుదలైన సిసిలియా, క్వార్జ్ వంటి తేలికైన రసాయనాలు చల్లబడి పైకి తేలి భూమి ఏర్పడింది. ఇదంతా జరగడానికి కొన్ని వందల బిలియన్ సంవత్సరాలు పట్టి ఉండొ చ్చన్నది వారి అభిప్రాయం.
కొన్ని ప్రత్యేక పోషకాలు సముద్ర నీటిలోకి చేరి ఆ నీటి నుంచి ఆక్సిజన్ తయారైందని, ఉపవాయువు పెరుగుదల దాదాపు 250 కోట్ల సంవత్సరాల కిందట ప్రారంభమైందనే ఏకాభిప్రాయానికి వచ్చారు. తరువాత బీచ్, నివాసయోగ్యమైన భూమి ఏర్పడిందన్నది శాస్త్రవేత్తల అభిప్రాయం. అక్కడి తీరంలో ఉన్న నదీమార్గాలు, ఇసుకరాళ్లను విశ్లేషించిన అనంతరం ఈ అభిప్రాయానికొచ్చారు. అయితే ఎంత భూ భాగం ఏర్పడింది, ఇవి ఎంతకాలం అలా నీటిపై తేలుతూ ఉన్నాయన్నది మాత్రం ఇప్పటికీ మిస్టరీనే.
–సాక్షి సెంట్రల్ డెస్క్
పరిశోధనలకు దిక్సూచి...
‘‘ఇక్కడ ప్రత్యేకమైన అవక్షేప శిలలను గుర్తించాం. వాటి వయసు, అవి ఎలాంటి పరిస్థితుల్లో ఏర్పడ్డాయనే విషయంపై పరిశోధనలు చేశాం. ఆ శిలల్లో ఉన్న యురేనియం, లెడ్ కంటెంట్ను బట్టి వాటి వయసును కనుక్కోగలిగాం. ఆ రాళ్లు 310 కోట్ల సంవత్సరాల కిందటివి’’ అని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త ప్రియదర్శి చౌదరి తెలిపారు. దాదాపు ఇదే కాలంలో దక్షిణాఫ్రికాలోని కాప్వాల్ క్రాటన్, ఆస్ట్రేలియాలోని పిల్బరా క్రాటన్ ఏర్పడి ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ‘‘ఇదే కాదు ధార్వాడ్, బస్తర్, బుందేల్ఖండ్లలోనూ ఇలాంటి పురాతన భూభాగాలున్నాయి. వాటన్నంటినీ అర్థం చేసుకోవడానికి ఈ పరిశోధన దిక్సూచి అవుతుంది’’ అని ప్రియదర్శి చౌదరి పేర్కొన్నారు.