1765 నాటి గాలితో శిల్పం

9 Oct, 2021 10:07 IST|Sakshi

పరిశ్రమలతో ప్రస్తుతం వాతావరణం ఎంతగా కలుషితం అవుతోందో మనకు తెలుసు. ప్రపంచంలో పారిశ్రామిక విప్లవం రాక ముందు గాలి నాణ్యత ఎలా ఉండేది? అప్పటి పరిస్థితులను తెలుసుకోవడం ఎలా? ఈ ఆలోచనతో కళాకారుడు, రాయల్‌ కాలేజీ ఆఫ్‌ ఆర్ట్స్‌ పీహెచ్‌డీ అభ్యర్థి వేన్‌ బినిటీ గాజుతో కూడిన ఓ శిల్పాన్ని రూపొందించారు. దానిలో 1765కు ముందు గాలిని నింపి త్వరలో స్లాట్లాండ్‌లోని గ్లాస్గోలో జరగబోయే కాప్‌–26 సదస్సులో భాగంగా నిర్వహించే ‘పోలార్‌ జీరో ఎగ్జిబిషన్‌’లో ప్రదర్శనకు ఉంచనున్నారు. 

అంటార్కిటికా ఐస్‌ నుంచి..
శిల్పంలో నింపిన గాలిని అంటార్కిటికా మంచు పొరల నుంచి సేకరించారు. గాలిని సేకరించడానికి బ్రిటిష్‌ అంటార్కిటిక్‌ సర్వే (బీఏఎస్‌) సైంటిస్టులతో కలసి బినిటీ ఐదేళ్ల పాటు ఆ మంచు ఖండంలో డ్రిల్లింగ్‌ చేశారు. 170 మీటర్ల లోతు వరకూ తవ్వకాలు జరిపి మంచును సేకరించారు. దానిని విశ్లేషించి డబ్బాల్లో నింపి పెట్టారు. పర్యావరణ మార్పులను మంచు పొరల్లో గుర్తిస్తూ 1765కు నాటి పరిస్థితులను అంచనా వేశారు. ఆ పొరల్లోని చిన్ని చిన్ని బుడగల నుంచి గాలిని సేకరించారు. ‘‘నా కళ హిమ ఖండాల భూత, వర్తమాన, భవిష్యత్‌ పరిస్థితులను తెలుపుతుంది.
చదవండి: అమెరికా అణు జలాంతర్గామికి ప్రమాదం.. ఆందోళన వ్యక్తం చేసిన చైనా

ధ్రువ ప్రాంతాలపై ప్రజలకు అవగాహన కలిగిస్తుంది’’ అని బినిటీ అభిప్రాయపడ్డారు. లిక్విడ్‌ సిలికాన్‌తో నింపిన గాజు సిలిండర్‌లో 1765 నాటి గాలిని నింపి ఆ కళాఖండాన్ని రూపొందించారు. లిక్విడ్‌ సిలికాన్‌ మనకు కనిపిస్తుంది. దానిపైన అత్యంత జాగ్రత్తగా సేకరించిన ఆనాటి గాలి నిండి ఉంటుంది. సాంకేతికంగా సవాలుగా నిలిచే ఈ శిల్పాన్ని ఆధునిక ఇంజనీరింగ్‌ సామర్థ్యాలతో బీఏఎస్‌ ల్యాబ్‌లో రూపొందిస్తున్నారు. దీన్ని మొత్తాన్ని వీడియో తీసి ఆన్‌లైన్‌లో ఉంచనున్నారు. 
చదవండి: అఫ్గనిస్తాన్‌లో భారీ బాంబు పేలుడు.. 100 మందికి పైగా మృతి

1765 కీలకమైన సంవత్సరం
బీఏఎస్‌ శాస్త్రవేత్త ముల్వానే మాట్లాడుతూ.. ‘‘మంచు నీటి మాలిక్యూల్స్‌లోని ఐసోటోపిక్‌ కంపోజిషన్‌ ద్వారా ఆ మార్పులను గుర్తించవచ్చు. 10 వేల సంవత్సరాల క్రితం నుంచి సుమారు 1765 వరకూ గాలిలో బొగ్గుపులుసు వాయువు స్థాయి దాదాపు ఒకేలా ఉంది. ఆ ఏడాది వరకూ 280 పీపీఎమ్‌ ఉండేది. ఆ దశకంలో జేమ్స్‌ వాట్‌ ఆవిరి యంత్రం రూపొందించాక పారిశ్రామిక విప్లవం మొదలైంది. అప్పటి నుంచే కార్బన్‌ డైయాక్సైడ్‌ క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాది మే నెలలో వాతావరణంలో బొగ్గుపులుసు వాయువు స్థాయి 419 పీపీఎంకు చేరింది. ఇప్పుడు ఈ శిల్పం ప్రజల ఊహకు ఓ ప్రేరణగా నిలుస్తుంది. వాతావరణంలో మార్పులను మంచు పొరలను పరిశీలించడం ద్వారా సులువుగా తెలుసుకోవచ్చు’’ అని ఆయన పేర్కొన్నారు.     

మరిన్ని వార్తలు