పార్లమెంట్‌లో మహిళా సభ్యురాలిపై చేయి చేసుకున్న ఎంపీ.. వీడియో వైరల్‌

5 Dec, 2022 11:04 IST|Sakshi

డాకర్‌: పార్లమెంట్‌  బడ్జెట్‌ సమావేశాల్లో అనూహ్య సంఘటన జరిగింది. ఓ మహిళా చట్ట సభ్యురాలిపై మరో ఎంపీ చేయి చేసుకున్నాడు. ఇష్టారీతిన దాడి చేశాడు. ఈ సంఘటన ఆఫ్రికాలోని సెనెగల్‌ దేశంలో బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా జరిగింది. ప్రస్తుతం ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. 

అధికార కూటమి బెన్నో బాక్‌ యకార్‌(బీబీవై)కి చెందిన మహిళా చట్టసభ్యురాలు అమి డైయే గ్నిబీపై.. ప్రతిపక్ష ఎంపీ మస్సాటా సాంబ్‌ చేయి చేసుకున్నాడు. దాడి చేసిన క్రమంలో  పార్లమెంట్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు పక్షాల ఎంపీలు కుర్చీలు, పేపర్లు విసురుకున్నారు. తనపై దాడి చేసిన సాంబ్‌పై కుర్చీ విసిరి పడిపోయారు గ్నిబీ. ఇరువురిని వేరు చేసేందుకు మరికొంత మంది ఎంపీలు ప్రయత్నించారు. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైన క్రమంలో సమావేశాలను వాయిదా వేశారు. 

అధ్యక్షుడు మాకి సాల్‌ మూడోసారి ఎన్నికను గ్నీబి వ్యతిరేకించారు. మరోవైపు.. సాంబ్‌ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన క్రమంలో ఆయన ఆమె వద్దకు వచ్చి దాడి చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఈ ఏడాది జులైలో జరిగిన ఎన్నికల్లో అధికార కూటమికి మెజారిటీ రాకపోవటంతో అధికార, ప్రతిపక్షాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నారు నేతలు.

ఇదీ చదవండి: మస్క్‌లో ప్రవహించే రక్తం సగం చైనాదే!.. ఎలన్‌ మస్క్‌ పుట్టుకపై తీవ్ర వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు