చైనాలో మ‌రో‌ వైర‌స్‌: ఏడుగురు మృ‌తి

6 Aug, 2020 14:33 IST|Sakshi

బీజింగ్‌: మాన‌వాళిని వ‌ణికిస్తున్న క‌రోనా వైర‌స్ జ‌న్మ‌స్థానానికి కేంద్రంగా భావిస్తోన్న చైనాలో ఇప్పుడు మ‌రో ప్ర‌మాద‌క‌ర‌ వైర‌స్ వెలుగు చూసింది. ఎస్ఎఫ్‌టీఎస్ (సివియ‌ర్ ఫీవ‌ర్ విత్ త్రామ్‌బోసిటోపెనియా సిండ్రోమ్) వైరస్‌గా పిలుస్తోన్న దీని వ‌ల్ల‌‌‌ ఇప్ప‌టివ‌ర‌కు ఏడుగురు ప్రాణాలు కోల్పోగా మ‌రో 60 మంది దీని బారిన ప‌డ్డారు. ఈ మేర‌కు చైనా అధికారిక మీడియా గ్లోబ‌ల్ టైమ్స్‌ బుధ‌వారం క‌థనాన్ని వెలువ‌రించింది. ముఖ్యంగా ఈ మాయ‌దారి వైర‌స్ మ‌నుషుల ద్వారా వ్యాప్తి చెందుతుంద‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి జూన్ వ‌ర‌కు తూర్పు చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లో 37 కేసులు న‌మోద‌వ‌గా గ‌త నెల‌లో ఒక్క‌ అన్హూయ్ ప్రావిన్స్‌లోనే 23 కేసులు వెలుగు చూడ‌టం గ‌మ‌నార్హం. (కరెన్సీ నోట్లతో కరోనా వ్యాపిస్తుందా?)

అయితే ఈ వైర‌స్ కొత్త‌దేమీ కాదు. 2010లో తొలిసారిగా చైనాలో ఇది ఉనికిలోకి వ‌చ్చింది. ఆ త‌ర్వాత జ‌పాన్, కొరి‌యాల్లోనూ ఈ త‌ర‌హా కేసులు వెలుగు చూశాయి. ఈ వైర‌స్ సోకిన‌వారిలో జ్వ‌రం, దగ్గు ల‌క్ష‌ణాలు తీవ్రంగా క‌నిపిస్తాయి. మ‌ర‌ణాల రేటు 10-16 శాతంగా ఉంది. ప‌దేళ్ల త‌ర్వాత ఈ ఎస్ఎఫ్‌టీఎస్ వైర‌స్ కేసుల సంఖ్య మ‌ళ్లీ పెరుగుతుండ‌టం ఆందోళ‌న క‌లిగించే విష‌యం. న‌ల్లి(టిక్‌) వంటి కీట‌కాల ద్వారా ఈ వైర‌స్ వ్యాపించి ఉండ‌వ‌చ్చ‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. అయితే మనిషి ర‌క్తం, శ్లేషం ద్వారా కూడా ఇది సంక్ర‌మిస్తుందని ఝెజియాంగ్ యూనివ‌ర్సిటీ ఆసుప‌త్రి వైద్యులు షెంగ్ జిఫాంగ్ పేర్కొన్నారు. అలాగే మ‌నుషుల నుంచి మ‌నుషుల‌కు వ్యాపించేందుకు కూడా ఆస్కారం లేక‌పోలేద‌ని చెప్పుకొచ్చారు. అయితే ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌లు తీసుకున్నంత కాలం దీని గురించి పెద్ద‌గా భ‌య‌ప‌డ‌న‌వ‌స‌రం లేద‌ని వైద్యులు అంటున్నారు. (ప్రతి 15 సెకన్లకు ఓ ప్రాణం పోతుంది)

మరిన్ని వార్తలు