రష్యా వ్యాక్సిన్‌తో సైడ్‌ ఎఫెక్ట్స్‌

17 Sep, 2020 13:40 IST|Sakshi

మాస్కో: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాకు వ్యాక్సిన్‌ కనిపెట్టడానినికి అన్ని దేశాలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదిలా వుండగా రష్యా టీకాను విజయవంతంగా తయారుచేశామని దాని క్లినికల్‌ ట్రయల్స్‌ కూడా పూర్తయ్యాయని ప్రకటించి వాటిని ప్రజలకు కూడా ఇవ్వడం ప్రారంభించింది. రష్యా వ్యాక్సిన్‌ స్పుత్నిక్-వీపై అందరూ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆ వ్యాక్సిన్‌ వేసుకున్న కొంతమంది సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తున్నాయని ఫిర్యాదు చేశారు. ఏడుగురిలో ఒకరు తమకు జ్వరం, ఒంటినొప్పులు ఉన్నాయని రష్యా ఆరోగ్య శాఖ తెలిపింది. 

మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా వ్యాక్సిన్ వేయించుకున్న 300 మంది వాలంటీర్లలో 14 శాతం మంది వాలంటీర్లకు ఒళ్లు నొప్పులు, నీరసం, జ్వరం వంటి సమస్యలు వచ్చాయని చెప్పారు. అయితే, ఈ సైడ్ ఎఫెక్స్‌ తాము ఊహించినవేనని రష్యా ఆరోగ్య శాఖ వెల్లడించింది. అవి ఒకటి, ఒకటిన్నర రోజుల్లో తగ్గిపోతాయని చెప్పారు. మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 వేల మందికి టీకా ఇస్తామని రష్యా ప్రకటించింది. ఈ నేపథ్యంలో రష్యా ఇటీవల 300 మంది వాలంటీర్లకు వ్యాక్సిన్‌ మొదటి డోసు వేయగా వారిలో 14 శాతంమంది స్వల్ప దుష్ఫలితాలు ఉన్నాయని తెలిపారు.

ఇక భారతదేశంలో ఈ వ్యాక్సిన్‌ మూడవ దశ ఔషధ పరీక్షలతోపాటు పంపిణీకై హైదరాబాద్‌ సంస్థ డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్, రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ (ఆర్‌డీఐఎఫ్‌) మధ్య ఒప్పందం కుదుర్చుకున్నారు. అలాగే భారత ఔషధ నియంత్రణ సంస్థ నుంచి అనుమతి లభించిన తర్వాత రెడ్డీస్‌కు 10 కోట్ల డోసుల వ్యాక్సిన్లను ఆర్‌డీఐఎఫ్‌ సరఫరా చేయనుంది. రష్యా సరైన పరీక్షలు చేయకుండానే వ్యాక్సిన్‌ను తీసుకొస్తోందని ప్రపంచ వ్యాప్తంగా ఇటీవల విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. చదవండి: రష్యా వ్యాక్సిన్‌ వయా డాక్టర్‌ రెడ్డీస్‌

మరిన్ని వార్తలు