ఆన్‌లైన్‌ వేదికగా వినతులు.. భారత సంతతి వ్యక్తికి ఆగిన ఉరిశిక్ష 

9 Nov, 2021 07:47 IST|Sakshi

సింగపూర్‌: సింగపూర్‌లోకి అక్రమంగా మాదకద్రవ్యాలను తెస్తున్నాడనే అభియోగాలతో ఉరిశిక్ష పడిన భారతీయ మూలాలున్న మలేసియన్‌ నాగేంద్రన్‌ కె.ధర్మలింగం ఉరిశిక్ష అమలు ఎట్టకేలకు ఆగింది. మానసిక దివ్యాంగుడైన 33 ఏళ్ల నాగేంద్రన్‌కు విధించిన కఠినశిక్షను తగ్గించాలంటూ ఆన్‌లైన్‌ వేదికగా వేలాది మంది మానవహక్కుల కార్యకర్తలు, సంఘాల నుంచి వినతులు వెల్లువెత్తడంతో సింగపూర్‌ తన నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదావేసింది.

దాంతో అక్కడి జైలులో నవంబర్‌ పదో తేదీన అమలుచేయాల్సిన ఉరిశిక్ష అమలు తాత్కాలికంగా ఆగింది. శిక్ష తగ్గింపు, రద్దుకు సంబంధించిన ఒక పిటిషన్‌ను మంగళవారం ఆన్‌లైన్‌లో విచారించాల్సి ఉన్నందున శిక్ష అమలును ప్రస్తుతం ఆపాలని సింగపూర్‌ హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. మంగళవారం నాటి పిటిషన్‌ను హైకోర్టు కొట్టేస్తే 10వ తేదీనే ఉరిశిక్ష అమలుచేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు