Robots Now Patrol Singapore Streets: ఇక నుంచి వీధుల్లో రోబోల గస్తీ...

6 Oct, 2021 15:39 IST|Sakshi

సింగపూర్‌: షాపింగ్‌ మాల్స్‌, బస్టాండ్స్‌, రైల్వేస్టేషన్స్‌లోనూ ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాల్లో కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరగడం మనం తరుచుగా చూస్తుంటాం. వాటిని అరికట్టడం కోసం పోలీసులు, అధికారులు ఎన్నో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ ఎక్కడో ఒక చోట ఘటనలు జరుగుతూనే ఉంటాయి. అంతెందుకు కరోనా సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ప్రజలను గుమిగూడకండి, సామాజిక దూరం పాటించండి అంటూ ఎంతలా మొత్తుకున్న వాళ్లను కంట్రోల్‌ చేయడం పోలీస్‌ యంత్రాగానికీ ఎంత తలనొప్పిగా తయారయ్యిందో మనకు తెలిసిందే. ప్రస్తుతం అలాంటి సంఘటనలు తలెత్తకుండా సరికొత్త రోబో టెక్నాలజీతో చెక్‌ పెట్టాలని సింగపూర్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

వివరాల్లోకెళ్లితే సింగపూర్‌లోని హౌసింగ్ ఎస్టేట్, షాపింగ్ మాల్స్‌లలో రెండు చక్రాల రోబోతో గత మూడు వారాలుగా గస్తీ నిర్వహించారు. అక్కడ మాల్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పర్యవేక్షించడమే కాక ప్రజలు సామాజిక దూరం పాటించేలా ఆ రోబో హెచ్చరికలు జారీ చేస్తుంది. అంతేకాదు నిషేధిత ప్రాంతాల్లో ధూమపానం, పార్కింగ్‌ సరిగ్గా చేయకపోయినా,  కరోనావైరస్  సంబంధించి సామాజిక దూరం..తదితర నియమాలను ఉల్లఘించకుండా  హెచరికలనూ జారీ చేసేలా రూపొందించారు.

ఈ రోబోలలో  ఏడు అత్యధునిక కెమెరాలతో నిర్మితమై మనుష్యుల ముఖాలను గుర్తించడమే కాక వారికీ వాయిస్‌ రికార్డర్‌ ద్వారా హెచ్చరికలను కూడా జారీ చేస్తుంది. గత మూడు వారాల నంచి అధికారులు ఈ రోబోలు పని తీరుపై ట్రయల్స్‌ నిర్వహించారు. సింగపూర్‌ ప్రభుత్వాధికారులు హైపర్-ఎఫిషియెంట్, టెక్-డ్రైవ్డ్ "స్మార్ట్ నేషన్" పై దృష్టి సారించి ఈ అత్యధునిక టెక్నాలజీతో కూడిన రోబోలను ఆవిష్కరించిన‍ట్లు వెల్లడించారు. అయితే, సింగపూర్‌వాసులు ఈ అత్యధునిక టెక్నాలజీ కారణంగా తమ గోప్యతకు (డేటా) భద్రత ఉండదని వాపోతున్నారు. 

రోబోల వల్ల శ్రామిక శక్తి తగ్గిపోతుందని, తమ గోప్యతకు భంగం వాటిల్లుతోందంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ ప్రభుత్వం పౌరుల స్వేచ్ఛా హక్కులను కాలరాస్తుందంటూ సింగపూర్‌ వ్యాప్తంగా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

మరిన్ని వార్తలు