వేలానికి 40 ఏళ్ల నాటి కేక్‌ ముక్క.. ధర ఏకంగా

31 Jul, 2021 11:10 IST|Sakshi
వేలానికి రాబోతున్న 40 ఏళ్ల నాటి కేక్‌ ముక్క

వేలానికి ప్రిన్సెస్ డయానా-ప్రిన్స్ చార్లెస్‌ల పెళ్లి కేక్‌ ముక్క

లండన్‌: పురాతన కాలం నాటి వస్తువులు.. ముఖ్యంగా రాజులు, రాణలుకు సంబంధించిన వస్తువులు పట్ల చాలా మంది అమితాసక్తి కనబరుస్తుంటారు. ఈ తరహా వస్తువుల వేలం కోసం ఎదురు చూస్తుంటారు. వాటికి లక్షల్లో డబ్బులు చెల్లించి మరి సొంతం చేసుకుంటారు. వేలం పాటలో వస్తువులను సొంతం చేసుకుంటే పర్లేదు కానీ.. మరీ ఏళ్ల క్రితం నాటి ఆహారాన్ని తెచ్చుకుంటే ఏం లాభం ఉంటుంది. అటు తినలేం ఇటు పడేయలేం. వాసన రాకుండా జాగ్రత్తగా దాచుకోవాల్సిందే. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే 40 ఏళ్ల క్రితం నాటి ఓ కేకు ముక్క వేలానికి రాబోతుంది. అది కూడా బ్రిటన్‌ రాణి డయనా పెళ్లి నాటి కేకు కావడంతో చాలా మంది దీని వేలం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ వివరాలు..

ప్రిన్సెస్ డయానా-ప్రిన్స్ చార్లెస్ వివాహ సందర్భంగా అనగా 1981 కాలంలో తయారు చేసిన కేక్‌ ముక్కను త్వరలో వేలం వేయబోతున్నారు. వివాహం సందర్భంగా వచ్చిన 23 అధికారక పెళ్లి కేకుల్లోని ఓదాని ముక్కను త్వరలో వేలం వేయబోతున్నారు. దీనిపై జూలై 29, 1981 అని డేట్‌ రాసి ఉంది. ఇది మార్జిపాన్ బేస్, షుగర్ ఆన్‌లే కోట్-ఆఫ్-ఆర్మ్స్, పైన బంగారం, ఎరుపు, నీలం వెండి రంగులతో అలంకరించబడి ఉంది. 

కేక్‌ ముక్కను క్లారెన్స్ హౌస్‌లోని రాణి తల్లిగారి ఇంటి సభ్యురాలైన మొయిరా స్మిత్‌కు ఇవ్వబడింది. ఆమె దీన్ని ఓ పూల కేక్‌ టిన్‌లో భద్రపరిచింది. ఈ టిన్‌ మూత మీద చేతితో తయారు చేసిన లేబుల్‌ అంటించి ఉంది. దాని మీద ‘చాలా జాగ్రత్తగా పట్టుకొండి.. ఇది ప్రిన్స్‌ చార్లెస్‌-ప్రిన్సెస్‌ డయానాల వివాహ కేక్‌’ అని ఉంది. అలానే 24-07-81 అని డేట్‌ వేసి ఉంది. స్మిత్‌ కుటుంబ సభ్యులు 2008లో ఈ కేక్‌ను ఓ వ్యక్తికి అమ్మారు. ఆ తర్వాత ఆగస్టు, 2011న ఈ కేక్‌ను మరోసారి వేలం వేశారు. 

త్వరలో జరగబోయే వేలంలో ఈ కేక్‌ ముక్క 300-500 పౌండ్ల (31,027-51,712) ధర పలుకుతుందని భావిస్తున్నారు. ఈ కేక్‌ ముక్క వేలం పాట సదర్భంగా సర్వీస్ ఆర్డర్, వేడుక వివరాలు, ఒక రాయల్ వెడ్డింగ్ అల్పాహార కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా డోమినిక్‌ వింటర్‌ ఔక్షనీర్స్‌ సీనియర్‌ సభ్యుడు ఒకరు మాట్లాడుతూ.. ‘‘వాస్తవంగా ఈ కేక్‌ ముక్కను అమ్మినప్పుడు ఎలా ఉందో.. ఇప్పుడు కూడా అంతే తాజాగా ఉంది. అయితే పొరపాటున కూడా దీన్ని తినకూడదు అని హెచ్చరిస్తున్నాం’’ అని తెలిపారు. 
 

మరిన్ని వార్తలు