సైక్లిస్టులకూ స్మార్ట్‌ సిగ్నలింగ్‌!

12 Oct, 2020 18:55 IST|Sakshi

సౌతాంప్టన్‌: ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన రంగంలో ఎప్పటికప్పుడు వస్తోన్న మార్పులను అందిపుచ్చుకొని ప్రతి రంగాన్ని అభివృద్ధి చేసుకుంటూ పోయినప్పుడే నిజమైన పురోభివృద్ధి మానవ జాతి సాధించగలదన్నది తెల్సిందే. కాలుష్యం నియంత్రణలో భాగంగా ఇంగ్లండ్‌ ప్రభుత్వం గత కొంత కాలంగా మోటారు వాహనాల స్థానంలో సైకిళ్లను ప్రోత్సహిస్తూ వస్తోన్నది. అయినప్పటికీ వాహనాల సంఖ్య తగ్గక పోగా, ప్రతి కూడలి వద్ద రద్దీగా పెరుగుతుండడంతో సైకిళ్లపై ప్రయాణించడమన్నది సైక్లిస్టులకు భారంగా తయారయింది. ఈ నేపథ్యంలో ప్రతి కూడలి వద్ద వారికి అనుకూలమైన సిగ్నలింగ్‌ వ్యవస్థ తీసుకురావాలని ప్రభుత్వం సంకల్పించింది.

ఒకప్పుడు పాదాచారులకు ప్రాధాన్యమిచ్చిన తీరులో ఇప్పుడు సైక్లిస్టులు వెళ్లేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ వ్యవస్థను ఏర్పాటు చేయడమే ఇంగ్లండ్‌ ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యత. గతంలో పాదాచారుల కోసం నిర్దిష్ట సమయంలో గ్రీన్‌ సిగ్నల్‌ వెలగ్గా, ఇప్పుడు నిర్దిష్ట సంఖ్యలో సైకిళ్లను చూసి వెంటనే వాటికి ముందుగా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం ప్రభుత్వం ప్రవేశ పెడుతోన్న స్మార్ట్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థ లక్ష్యం. ఇందుకు విద్యుత్‌ వైర్లు అవసరం లేని ‘ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌’ను ఉపయోగిస్తోంది.

ఈ స్మార్ట్‌ వ్యవస్థను ముందుగా ప్రయోగాత్మకంగా లండన్‌తోపాటు వోల్వర్‌హామ్‌టన్, కోవెంట్లీ, సౌతాంప్టన్‌లో ముందుగా ప్రవేశపెడుతున్నారు. తర్వాత దీన్ని అన్ని నగరాలకు విస్తరించనున్నారు. ఈ స్మార్ట్‌ వ్యవస్థను ఇంతకుముందే అమల్లోకి తీసుకరావాలనుకున్నారు. కానీ కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. (చదవండి: ఒక్కసారిగా ఏడ్చేసిన కిమ్‌)

మరిన్ని వార్తలు