లాక్‌డౌన్‌ నియమాలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా

19 Nov, 2020 13:54 IST|Sakshi

మెల్‌బోర్న్‌: కరోనా వైరస్‌ పుట్టి ఏడాది పూర్తయ్యింది. ఇంతవరకు మహమ్మారి పని పట్టే వ్యాక్సిన్‌ రాలేదు. కానీ వైరస్‌ మాత్రం వీర విహారం చేస్తుంది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ప్రారంభమయ్యింది. ఈ క్రమంలో వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడం కోసం ఆయా దేశాలు మరోమారు లాక్‌డౌన్‌ని విధిస్తున్నాయి. ఈ జాబితాలో ఆస్ట్రేలియా కూడా ఉంది. సెకండ్‌ వేవ్‌ కట్టడి కోసం ఈ సారి మరింత కఠినంగా లాక్‌డౌన్‌ అమలు చేయాలని దక్షిణ ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దాని ప్రకారం ఔట్‌డోర్‌ ఎక్సర్‌సైజ్‌‌, డాగ్‌ వాకింగ్‌ వంటి కార్యక్రమాలని బ్యాన్‌ చేసింది. ఇక వారంలో ఆరు రోజుల్లో ఇంటికి కేవలం ఒక్కరికి మాత్రమే బయటకు వెళ్లడానికి అనుమతిస్తామని.. అది కూడా చాలా ముఖ్యమైన కారణాలకు మాత్రమే అని తెలిపింది. స్కూల్లు, కాలేజీలు, రెస్టారెంట్లు, యూనివర్సిటీలు, కేఫ్‌లను నిర్ణిత గడువు వరకు పూర్తిగా ముసి ఉంటాయి. పెళ్లిల్లు, చావులకు సంబంధించిన కార్యక్రమాలపై కూడా పూర్తి నిషేధం విధించింది. ఇక మాస్క్‌ ధరించడం తప్పనిసరి చేసింది. ఈ నియమాలన్ని నేటి నుంచి అమల్లోకి వస్తాయి. (చదవండి: కేంద్రం అనుమతిస్తే మరోసారి లాక్‌డౌన్‌..)

‘చాలా త్వరగా.. చాలా కఠినంగా లాక్‌డౌన్‌ని అమలు చేయాలి. అప్పుడే తక్కువ నష్టం వాటిల్లుతుంది’ అని అధికారులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా అడిలైడ్‌ పట్టణంలో ఓ హోటల్‌ క్లీనర్‌ ద్వారా 23 మందికి వైరస్‌ సోకింది. ప్రస్తుతం అధికారులు కాంటాక్ట్‌ ట్రేస్‌ చేసే పనిలో ఉన్నారు. ఇక కరోనా వైరస్‌ ఉపరితలాల మీద 24 గంటలపాటు జీవించి ఉంటుందని.. ఫలితంగా ఎక్కువ మందికి సోకుతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక వైరస్‌ బారిన పడిన వారిలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదని ఇది ఆందోళన కలిగించే అంశం అన్నారు. ఇక విక్టోరియా, మెల్‌బోర్న్‌ వంటి నగరాల్లో లాక్‌డౌన్‌ మంచి ప్రభావం చూపించింది. విక్టోరియాలో ఆగస్టులో 700 కేసులు ఉండగా.. ప్రస్తుతం అవి 20కి పడిపోయాయి. 

>
మరిన్ని వార్తలు