చైనా ఎంత పనిచేసింది.. పలు దేశాల్లో విమానాశ్రయాలు బంద్‌!

4 Nov, 2022 21:10 IST|Sakshi

డ్రాగన్‌ కంట్రీ చైనాకు చెందిన భారీ రాకెట్‌ శిథిలాలు నియంత్రణ కోల్పోయి భూమిపైకి వేగంగా దూసుకొస్తున్నాయి. కాగా, చైనా అభివృద్ధి చేసిన అత్యంత శక్తివంతమైన రాకెట్ లాంగ్ మార్చ్ 5బీ (సీజెడ్‌-5బీ) అక్టోబర్ 31న నింగిలోకి దూసుకెళ్లింది. అనంతరం, నియంత్రణ కోల్పోవడంతో రాకెట్‌ శిథిలాలు భూమిపై పడనున్నాయి. ఈ నేపథ్యంలో స్పెయిన్‌లోని పలు విమానాశ్రయాలను మూసివేశారు. 

వివరాల ప్రకారం.. అంతరిక్షంలో చైనా నిర్మిస్తున్న స్పేస్‌ స్టేషన్‌కు 20 టన్నుల బరువున్న మెంగ్టియన్ లాబొరేటరీ క్యాబిన్ మాడ్యూల్‌ను లాంగ్‌ మార్చ్‌ 5బీ ద్వారా పంపించారు. ఈ క్రమంలో లాంగ్‌ మార్చ్‌ నియంత్రణ కోల్పోవడంతో రాకెట్‌ శిథిలాలు.. అట్లాంటిక్‌ మహా సముద్రంలో కూలవచ్చని యూరోపియన్ యూనియన్ స్పేస్ సర్వైలెన్స్ అండ్ ట్రాకింగ్ సర్వీస్ అంచనా వేసింది. ఇందులో భాగంగానే ఉత్తర స్పెయిన్, పోర్చుగల్, దక్షిణ ఇటలీలో కూడా రాకెట్‌ శిథిలాలు కూలే ముప్పు ఉందని హెచ్చరించింది.

ఈ క్రమంలో అప్రమత్తమైన స్పెయిన్‌.. దేశంలోని పలు విమానాశ్రయాలను మూసివేసింది. దీంతో, టార్రాగోనా, ఇబిజా, రియస్‌లో విమాన రాకపోకలు నిలిచిపోయాయి. ఇక, ఫ్రాన్స్‌లోని మార్సెయిల్ విమానాశ్రయంలో కూడా హై అలర్ట్ ప్రకటించారు. విమానాల బంద్‌ కావడంతో యూరప్‌ వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు రాకెట్‌లోని కొన్ని భాగాలు శుక్రవారం, మరి కొన్ని భాగాలు శనివారం భూమిపై పడే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు