ఇమ్రాన్‌ ఖాన్‌ కంటే భారత్‌ ముఖ్యం: శ్రీలంక

22 Feb, 2021 15:54 IST|Sakshi

కొలంబో : పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు శ్రీలంక ప్రభుత్వం ఊహించని షాకిచ్చింది. శ్రీలంక‌ పర్యటనలో భాగంగా అక్కడి పార్ల‌మెంట్‌లో ఇమ్రాన్ ఖాన్ ఇవ్వాల్సిన ప్ర‌సంగాన్ని ఆ దేశం ర‌ద్దు చేసింది. భారత్‌తో ఎలాంటి వివాదం తలెత్తవద్దన్న ఉద్ధేశ్యంతోనే శ్రీలంక ఈ నిర్ణ‌యం తీసుకున్నట్లు కొలంబో గెజిట్ ప‌త్రిక త‌న క‌థ‌నంలో ప్రచురించింది. కాగా భారత్‌ శ్రీలంకకు కోవిడ్‌ 19 వ్యాక్సిన్‌లను అందిస్తోంది. ఇప్పటికే 5 లక్షల కోవిషిల్డ్‌ డోసులను ఆ దేశానికి పంపించింది. ఇలాంటి సమయంలో భారత్‌తో తమకున్న దౌత్య సంబంధాన్ని పణంగా పెట్టేందుకు శ్రీలంక సిద్ధంగా  లేనట్లు తెలుస్తోంది.

అంతేగాక శ్రీలంకలో ముస్లింల‌కు వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌లు కూడా జ‌రుగుతున్నాయి. మసీదులలో జంతువులను బలిస్తున్నారని అక్కడి బౌద్దులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో ఇమ్రాన్‌ ఒక‌వేళ శ్రీలంక పార్ల‌మెంట్‌లో మాట్లాడితే అప్పుడు భార‌త్‌తో పాటు స్థానిక బౌద్దులకు కూడా స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశాలు ఉన్న‌ట్లు భావించి ప్రధాని ప్రసంగాన్ని రద్దు చేసింది. కాగా ఇమ్రాన్ ఖాన్‌ అంతర్జాతీయ వేదికలపై జమ్మూకశ్మీర్‌పై అవాస్తవాలు ప్రచారం చేయడం అలవాటుగా మారిన విషయం తెలిసిందే. అయితే శ్రీలంకలో కూడా ఇమ్రాన్‌ ఖాన్‌ జమ్మూకశ్మీర్ అంశం లేవనెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రసంగం రద్దు చేయాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది.

కొలంబో పోర్టులోని ఈస్ట్ కంటైనర్ టర్మినల్ నిర్మాణం కోసం భారత్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని శ్రీలంక ఇటీవలే రద్దు చేసింది. దీని వెనుక చైనా హస్తం ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీలంక పార్లమెంట్‌లో పాక్ ప్రధాని నోట కశ్మీర్ ప్రస్తావన వస్తే.. ఇరు దేశాల దౌత్యసంబంధంపై మరింత ప్రభావం పడుతుందని శ్రీలంక ప్రభుత్వ వర్గాలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫిబ్రవరి 22 నుంచి రెండ్రోజులపాటు ఇమ్రాన్ శ్రీలంకలో పర్యటించనున్న విషయం తెలిసిందే. పార్లమెంటులో ప్రసంగం మినహా అన్ని కార్యక్రమాలు యథావిధంగా కొనసాగనున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు.

చదవండి: టూల్‌కిట్‌ వివాదం: పాక్‌ కీలక వ్యాఖ్యలు
టిక్‌టాక్‌లో.. కాస్ట్‌లీ మిస్టేక్‌!

మరిన్ని వార్తలు