ఉపేక్షించొద్దు.. అలాంటి వాళ్లను కాల్చేయండి: శ్రీలంకలో తీవ్ర హెచ్చరికలు

10 May, 2022 20:14 IST|Sakshi

కొలంబో: ప్రభుత్వ వ్యతిరేక ప్రజా నిరసన జ్వాలలతో హిందూ మహాసముద్రంలోని ద్వీప దేశం శ్రీలంక తగలబడిపోతోంది. సోమవారం ఉధృత స్థాయికి చేరిన హింసాత్మక అల్లర్లు.. మంగళవారం తారాస్థాయికి చేరుకున్నారు. ఇప్పటివరకు ఐదుగురు మరణించగా.. 220 మందికి పైగా గాయపడినట్లు అధికారిక సమాచారం. ఈ తరుణంలో మిలిటరీ, పోలీసులకు అత్యవసర అధికారాన్ని అప్పజెప్పిన సంక్షోభ-అస్థిర ప్రభుత్వం.. ఇప్పుడు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. 

ఆస్తులను ధ్వంసం చేసినా.. ఇతరులను గాయపరిచే లేదంటే చంపే యత్నం చేసినా.. ఉపేక్షించొద్దంటూ శ్రీ లంక రక్షణ శాఖ కీలక ప్రకటన చేసింది. అలాంటి వాళ్లను వెంటనే కాల్చేయాలంటూ మంగళవారం శ్రీ లంక రక్షణ శాఖ తన ఆదేశాల్లో పేర్కొంది . ఈ మేరకు సైన్యం, పోలీస్‌ శాఖ మైకుల ద్వారా హెచ్చరికలు జారీ చేయిస్తోంది. అదే తరుణంలో.. వారెంట్‌లు లేకుండా ఎవరినైనా అదుపులోకి తీసుకునే అధికారాల్ని సైతం కట్టబెట్టింది కూడా. దీంతో వందల మంది నిరసనకారుల్ని పోలీసులు జైళ్లకు తరలిస్తు‍న్నారు.

మరోవైపు పరిస్థితి చేజారిపోవడంతో.. ప్రజలంతా సమయమనం పాటించాలంటూ లంక అధ్యక్షుడు గోటబయా రాజపక్స​ మంగళవారం పిలుపు ఇచ్చాడు. లంకా దహనంపై స్పందించిన ఐరాస.. వీలైనంత త్వరగా సంక్షోభం ముగియాలని ఆశిస్తున్నట్లు పేర్కొంది.

మద్ధతుదారులను వదలడం లేదు 
ఇంతకాలం ప్రభుత్వ వ్యతిరేకతతో నిరసనలు కొనసాగుతుండగా.. గత రెండు రోజులుగా పరిణామాలు హింసాత్మకంగా మారిపోయాయి. ప్రభుత్వ మద్ధతుదారులు ఎక్కడ కనిపించినా చితకబాదుతున్నారు ప్రజలు. ప్రధాని పదవికి మహీంద రాజపక్స రాజీనామా ప్రకటించాక.. ఆయన మద్ధతుదారులు భారీ ఎత్తున్న ప్రధాని నివాసం టెంపుల్‌ ట్రీస్‌కు చేరుకుని మద్ధతు ప్రకటించారు. ఈ క్రమంలో.. నిరసనకారులు వాళ్లపై విరుచుకుపడ్డారు. సమీపంలో ఉన్న ఓ మురుగు కాలువలోకి రాజపక్స మద్ధతుదారుల్ని నెట్టిపడేశారు. ఈ ఉద్రిక్తతల నడుమ పోలీసులు, సైన్యం కల్పించుకుని వాళ్లను రక్షించింది. ఇక అప్పటి నుంచి ప్రజాప్రతినిధులు, అధికార వర్గాల ఇళ్లను మాత్రమే కాదు.. రాజపక్స మద్ధతుదారుల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని నిరసనకారులు దాడులు, తగలబెట్టేస్తున్నారు. 

ఇదిలా ఉండగా..  మాజీ ప్రధాని మహీంద రాజపక్స దేశం దాటి పారిపోతాడనే ప్రచారం ఊపందుకోవడంతో ఆయన కోసం గాలింపు చేపట్టారు నిరసనకారులు. అయితే ఆయన ఎక్కడికి వెళ్లబోడని ఆయన తనయుడు ఒక ప్రకటన విడుదల చేశాడు. ఇక ఎక్కడిక్కడ చెక్‌ పాయింట్‌లు ఏర్పాటు చేసి మరీ రాజపక్సను, అతని విధేయులను పారిపోకుండా కాపలా కాస్తున్నారు ప్రజలు.

చదవండి: నేవీ స్థావరంలో తలదాచుకున్న రాజపక్స కుటుంబం

మరిన్ని వార్తలు