రెచ్చిపోయిన నిరసనకారులు: కెనడా ప్రధానిపై రాళ్ల దాడి

7 Sep, 2021 15:43 IST|Sakshi

కెనడాలో తీవ్ర రూపం దాల్చిన వ్యాక్సిన్‌ వ్యతిరేక ఉద్యమం

ప్రభుత్వ ఆంక్షలపై ఆగ్రహం

పట్టించుకోని ప్రధాని జస్టిన్‌ ట్రూడో

రెండు వారాల్లో జరగనున్న ఎన్నికలు

ఒట్టావా:  కెనడాలో నిరసనకారులు రెచ్చిపోయారు. ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడోపై రాళ్ల దాడి చేశారు. ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ప్రధానిపై నిరసన వ్యక్తం చేస్తూ కొందరు రాళ్లు విసిరారు. అయితే భద్రతా సిబ్బంది అప్రమత్తమవడంతో ప్రధానికి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఉద్రిక్తత ఏర్పడింది. ఈ ఘటన కెనడాలోని ఒంటారియాలో చోటుచేసుకుంది. కెనడాలో వ్యాక్సినేషన్‌ తప్పనిసరిగా చేశారు. అయితే ఆ దేశంలో వ్యాక్సిన్‌కు వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనిపై ఆందోళనలు చోటుచేసుకుంటున్నాయి. 
చదవండి: జైలులో సొరంగం.. ‘జులాయి’ సినిమాలో మాదిరి

ఈ క్రమంలో ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడో ఒంటారియోలో ఎన్నికల సభకు పాల్గొనేందుకు వెళ్తున్నారు. దీంతో వ్యాక్సిన్‌ వ్యతిరేకులు ప్రధాని కాన్వాయ్‌ను చుట్టుముట్టారు. ఈ సమయంలో రెచ్చిపోయి చిన్న చిన్న రాళ్లతో దాడికి పాల్పడ్డారు. అయితే ప్రధాని సురక్షితంగా బయటపడగా ఆయన భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఈ దాడిపై ప్రధాని ట్రూడో స్పందిస్తూ.. ‘నా భుజంపై కొన్ని చిన్న రాళ్లు తగిలాయి. అయితే ఈ దాడితో నేను బెదరడం లేదు’ అని స్పష్టం చేశారు. ఈ దాడిపై ప్రతిపక్ష నాయకులు కూడా స్పందించి ప్రధానిపై దాడిని ఖండించారు.

అయితే దాడికి పాల్పడడానికి ప్రధాన కారణం ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేసుకోవాలని నిబంధన విధించడమేగా తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలందరూ వ్యాక్సిన్‌ కచ్చితంగా వేసుకోవాలని ప్రధాని ట్రూడో ఆందక్షలు విధించారు. దానికి సంబంధించిన సర్టిఫికెట్‌ కూడా తప్పనిసరి చేశారు. అయితే దీనికి కొందరు ‘యాంటీ వ్యాక్సిన్‌’ ఉద్యమం లేవనెత్తారు. ఆందోళనకారులు వ్యాక్సినేషన్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారు. అందులో భాగంగా ప్రధానిపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. అయితే ఎన్నికల ముందు ఈ ఘటన జరగడం కలకలం రేపింది. సెప్టెంబర్‌ 20వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ట్రూడో పార్టీకి ప్రతికూల ప్రభావం ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది.

మరిన్ని వార్తలు