Exam Result తప్పుగా మెసేజ్‌ వచ్చింది.. తొందరపడి ప్రాణం తీసుకుంది

30 Oct, 2021 12:59 IST|Sakshi

సాధారణంగా పొరపాట్లు జరుగుతుండడం సహజం. అయితే ఆ పొరపాట్లు చిన్నవైనా, లేదా సరిదిద్దుకునేలా ఉన్నా ఫర్వాలేదు. కానీ వాటి వల్ల ఓ నిండు ప్రాణం బలైన విషాద ఘటన ఇంగ్లాండ్‌లో చోటుచేసుకుంది. ఇటీవల ఓ యువతికి పరీక్షల్లో ఫెయిల్‌ అయినట్లు పొరపాటున మెసేజ్‌ వచ్చింది. దీంతో ఆ బాధను భరించలేని ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.

స్థానిక మీడియా తెలపిన వివరాల ప్రకారం.. ఇంగ్లాండ్‌లో నార్త్‌ వేల్స్‌లోని ఏంగ్లెసేకు చెందిన మేరెడ్‌ ఫౌల్కీ అనే 21 ఏళ్ల అమ్మాయి కార్డిఫ్‌ యూనివర్సిటీలో రెండో సంవత్సరం ఫార్మాసూటికల్స్‌ చదువుతోంది. ఇటీవల పరీక్షలు రాసిన ఫౌల్కీకి కొన్ని రోజుల తరువాత యూనివర్సిటీ నుంచి ఒక ఈ మెయిల్‌ వచ్చింది. అందులో.. తను సెకండ​ ఇయర్‌ పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యిందని, ఈ కారణంగా మూడో సంవత్సరానికి వెళ్లేందుకు వీలు లేదని యూనివర్సిటీ యాజమాన్యం పేర్కొంది. ఎంతో ఇష్టంగా ఆ కోర్సు చదువుతున్న ఫౌల్కీ ఆ బాధను తట్టుకోలేక బతకడం వ్యర్థంగా భావించింది.

దీంతో ఆ ప్రాంతానికి సమీపంలోని బ్రిటానియా బ్రిడ్జి మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఫౌల్కీ ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. అందులో ఆమె 62 శాతం మార్కులతో పాసైనట్లు తేలింది. దీనిపై తాజాగా విచారణ జరిపిన కోర్టు తప్పుడు మెసేజ్‌ ఇచ్చిన యూనివర్సిటీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ యాజమాన్యంపై చర్యలకు ఆదేశించింది.

చదవండి: Afghanistan: దేశంలో పరిస్థితి బాలేదు.. మా డబ్బులు మాకు తిరిగివ్వండి: తాలిబన్లు

మరిన్ని వార్తలు