ఇండోనేసియా చర్చి వద్ద ఆత్మాహుతి దాడి

29 Mar, 2021 06:30 IST|Sakshi

మకస్సర్‌: ఇండోనేసియాలోని సులవేసి ద్వీపంలో ఆదివారం ఓ చర్చి వెలుపల జరిగిన ఆత్మాహుతి దాడిలో సుమారు 20 మంది గాయపడ్డారు. దక్షిణ సులవేసి ప్రావిన్సు రాజధాని మకస్సర్‌లోని సాక్రెడ్‌ హార్ట్స్‌ ఆఫ్‌ జీసస్‌ కెథెడ్రల్‌లోకి ఆదివారం ఉదయం 10.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చర్చి లోపలికి ప్రవేశించేందుకు బైక్‌పై వచ్చిన ఇద్దరు అగంతకులు యత్నించగా సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డగించారు. సిబ్బందితో వారు వాదులాటకు దిగారు.

అదే సమయంలో, అగంతకుల్లో ఒకరు తనను తాను పేల్చేసుకోవడంతో ఆ ఇద్దరూ అక్కడికక్కడే తునాతునకలయ్యారు. నలుగురు భద్రతా సిబ్బందితోపాటు చర్చిలో పామ్‌ సండే సామూహిక ప్రార్థనలు ముగించుకుని వస్తున్న భక్తులు గాయాలపాలయ్యారు. అగంతకుల్లో ఒకరు మహిళగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సూత్రధారులెవరో తెలియాల్సి ఉంది. ఇండోనేసియా ఘటనపై పోప్‌ ఫ్రాన్సిస్‌ విచారం వ్యక్తం చేశారు. ఆదివారం వాటికన్‌ సెయింట్‌ పీటర్స్‌ బసిలికాలో పామ్‌ సండే ప్రార్థనల సందర్భంగా బాధితుల కోసం ప్రార్థించాలని  ఆయన పిలుపునిచ్చారు.
(చదవండి: రోడ్డు మీద బురద నీటిలో బొర్లుతూ స్నానం!)

మరిన్ని వార్తలు