తాలిబన్ల మరో సంచలన నిర్ణయం.. మహిళలు యూనివర్సిటీల్లో చదవడంపై నిషేధం

21 Dec, 2022 10:47 IST|Sakshi

కాబూల్‌: అఫ్గనిస్తాన్‌లోని  తాలిబన్ల ప్రభుత్వంలో మహిళా లోకంపై అణచివేత నానాటికీ పెరుగుతోంది. అధికారాన్ని చేజిక్కుంచుకునే ముందు మహిళ హక్కుల కోసం పోరాడుతామని, ప్రజలకు స్వేచ్ఛాయుతమైన ప్రజాస్వామయ్య పాలన అందిస్తామని హామీ ఇచ్చిన తాలిబన్లు.. తరువాత తమ అనాలోచిత నిర్ణయాలు, అరాచక పాలనతో దేశంలోని పౌరుల నుంచే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. బాలికల స్వేచ్చను హరిస్తూ.. వారిని ఇప్పటికే ఉన్నత విద్యకు దూరం చేశారు. అనేక ఉద్యోగాల్లో మహిళలపై ఆంక్షలు విధించారు. దేశ మహిళలు బహిరంగ ప్రదేశాల్లో హిజాబ్‌ ధిరంచాల్సిందేనని ఆదేశించారు.

ఈ క్రమంలో తాజాగా తాలిబన్లు మరో సంచలన నిబంధన తీసుకొచ్చారు. దేశ వ్యాప్తంగా మహిళలకు యూనివర్సిటీ(విశ్వవిద్యాలయ) విద్యను నిషేధిస్తూ తాలిబన్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాలిబాన్ ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీచేసింది. మహిళా విద్యార్థులు విశ్వవిద్యాలయాల్లో చదువుకోవడాన్ని  నిషేధిస్తున్నట్లు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ యూనివర్సిటీలకు ఉన్నత విద్యాశాఖ మంత్రి నేడా మహ్మద్ నదీమ్ ఉత్వర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని తెలుపుతూ మేరకు ట్వీట్‌ చేశారు.

న్యూయర్క్‌లో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశమై.. తాలిబన్లు నిర్భంధించిన ఇద్దరు అమెరికన్లు విడుదల చేస్తున్నట్లు యూఎస్‌ విదేశాంగశాఖ వెల్లడించిన అనంతరం ఈ ప్రకటన వెలువడింది. అయితే తాలిబన్ల నిర్ణయంపై అమెరికాతోపాటు ప్రపంచ దేశాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున​ఆనయి. మహిళలను ఆంక్షలకు గురిచేస్తున్న తాలిబన్లను.. ఆప్గనిస్థాన్‌లోని అందరి హక్కులను గౌరవించే వరకు అంతర్జాతీయ సమాజంలో చట్టబద్ధమైన సభ్యులుగా ఉండేందుకు ఆశించలేమని విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ ఒక ప్రకటనలో తెలిపారు.
చదవండి: కాలిఫోర్నియాలో భారీ భూకంపం.. ఇద్దరు మృతి.. చీకట్లో వేల మంది..

మరిన్ని వార్తలు