అల్‌ఖైదా అగ్రనేత జవహరీ మృతిపై తాలిబన్‌ల సంచలన ప్రకటన

4 Aug, 2022 10:50 IST|Sakshi

కాబూల్‌: అల్‌ఖైదా అగ్రనాయకుడు అమాన్‌ అల్‌-జవహరీ మృతిపై తాలిబన్‌లు సంచలన ప్రకటన చేశారు. జవహరీ మృతి చెందలేదని తాలిబన్లు ప్రకటించారు. జవహారీ చనిపోయినట్లు  ఆధారాలు లేవని, ఆయన మృతిపై విచారణ జరుపుతున్నామని తెలిపారు.

కాగా అల్‌ఖైదా అధినేత అల్‌-జవహరీని అమెరికా మట్టుబెట్టినట్లు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. అప్గానిస్థాన్‌ రాజధాని కాబుల్‌లో జరిపిన డ్రోన్‌ దాడిలో అల్‌-జవహరీని హతమార్చినట్లు స్వయంగా అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ ప్రకటించారు. ఈజిప్టు సర్జన్‌ అయిన అల్‌-జవహరీ ప్రపంచంలోని మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్టుల్లో ఒకరిగా మారారు.

2001 సెప్టెంబర్‌ 11న (9/11 హైజాక్‌) అమెరికాపై జరిపిన ఉగ్రదాడుల్లో 3వేల మంది మరణించారు. ఈ దాడికి పాల్పడిన సూత్రధారుల్లో అల్‌ జవహరీ ఒకరు. అమెరికా దళాలు 2011లో ఒసామా బిన్‌లాడెన్‌ను హతమార్చిన తర్వాత అల్‌-ఖైదా పగ్గాలను జవహరీ స్వీకరించాడు. జవహరీపై 25 మిలియన్‌ డాలర్ల రివార్డును అమెరికా ఇప్పటికే ప్రకటించింది. 

కాబూల్‌లో జవహరీ మృతికి సంబంధించి డీఎన్‌ఏ ఆధారాలు లేవని అమెరికా ధృవీకరించింది. అయితే అనేక ఇతర మూలాల ద్వారా అతను చనిపోయినట్లు  గుర్తించినట్లు వైట్ హౌస్ తెలిపింది. ఇదిలా ఉండగా అమెరికా, తాలిబన్‌ల పరస్పర విభిన్న ప్రకటనలతో  అల్‌ఖైదా అధినేత జవహరీ మృతి ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.
ఇది కూడా చదవండి: జవహరీ హతం.. అమెరికన్లూ జాగ్రత్త! బైడెన్‌ సర్కారు అధికారిక ప్రకటన

మరిన్ని వార్తలు