Afghanistan: 13 మంది హజారాలను తాలిబన్లు అన్యాయంగా చంపేశారు

6 Oct, 2021 06:18 IST|Sakshi

ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ 

కైరో: అఫ్గాన్‌లోని హజారా వర్గానికి చెందిన 13 మందిని తాలిబన్లు అన్యాయంగా పొట్టనబెట్టుకున్నారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ తెలిపింది. వీరిలో ఎక్కువమంది తాలిబన్లకు లొంగిపోయిన అఫ్గాన్‌ సైనికులని వెల్లడించింది. డేకుండి ప్రావిన్స్‌లోని కహోర్‌ గ్రామంలో ఆగస్ట్‌ 30వ తేదీన ఈ దారుణం చోటుచేసుకున్నట్లు తమ దర్యాప్తులో వెల్లడైనట్లు పేర్కొంది. మృతుల్లో 11 మంది అఫ్గాన్‌ భద్రతా సిబ్బంది కాగా 17 ఏళ్ల బాలిక సహా ఇద్దరు పౌరులున్నట్లు తెలిపింది. ఈ వార్తలపై వివరణ కోరేందుకు అసోసియేటెడ్‌ ప్రెస్‌ ప్రతినిధి ఫోన్‌ ద్వారా యత్నించగా తాలిబన్‌లు స్పందించలేదు.

‘ఆగస్ట్‌ 14వ తేదీన డేకుండి ప్రావిన్స్‌ తాలిబన్ల హస్తగతమైంది. ఖిదిర్‌ జిల్లాలో 34 మంది సైనికులు తమ ఆయుధాలతో లొంగిపోయేందుకు సిద్ధమయ్యారు. అయితే, ఆగస్ట్‌ 30న 300 మందితో కూడిన తాలిబన్‌ కాన్వాయ్‌ సైనికులున్న గ్రామానికి చేరుకుంది. కుటుంబాలతో పాటు కొందరు సైనికులు అక్కడి నుంచి వెళ్లిపో యేందుకు యత్నించగా తాలిబన్లు విచక్షణా రహితంగా కాల్పులు ప్రారంభించారు. కాల్పుల్లో ఇద్దరు సైనికులతోపాటు, మసుమా అనే బాలిక, మరో వ్యక్తి చనిపోయారు. మాజీ సైనికుడొకరు జరిపిన కాల్పుల్లో ఒక తాలిబన్‌ ఫైటర్‌ చనిపోగా మరొకరు గాయపడ్డారు.

అనంతరం, లొంగిపోయిన సైనికుల్లో 9 మందిని తాలిబన్లు సమీపంలోని నది వద్దకు తీసుకెళ్లి కాల్చి చంపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో ఆధా రాలు మా వద్ద ఉన్నాయి’ అని ఆమ్నెస్టీ తెలిపింది. ఆమ్నెస్టీ సెక్రటరీ జనరల్‌ ఆగ్నెస్‌ మాట్లాడుతూ.. ‘హజారాలను దారుణంగా చంపడం తాలిబన్లు మారలేదనడానికి నిదర్శనం. అఫ్గాన్‌లో గతంలో అధికారంలో ఉండగా పాల్పడిన అకృత్యాలను తిరిగి సాగిస్తున్నారు’ అని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు