కెనడాలో తెలంగాణ విద్యార్థి బలవన్మరణం

1 Apr, 2021 19:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన కుమారుడు ప్రయోజకుడై తిరిగి వస్తాడనుకుంటే విగతజీవిగా వస్తున్నాడని తెలుసుకుని ఆ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నాయి. చేతికొచ్చిన కొడుకు  బలవన్మరణం చెందడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగింది. తెలంగాణకు చెందిన విద్యార్థి కెనడాలో ఆత్మహత్య చేసుకున్నాడు. భవనం పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో నల్గొండ జిల్లా డిండి మండలం ఆకుతోటపల్లిలో విషాదం నిండింది.

ఆకుతోటపల్లికి చెందిన నారాయణరావు, హైమావతి కుమారుడు ప్రవీణ్‌ రావు 2015లో ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లాడు. ఏమైందో ఏమోగానీ గురువారం తల్లిదండ్రులకు ఫోన్‌ వచ్చింది. ఈ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు అని చెప్పారు. ఉదయం భవనంపై నుంచి దూకి ప్రవీణ్‌ రావు ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే ప్రవీణ్‌మృతి చెందాడు. దీనిపై అక్కడి పోలీసులు విచారణ చేస్తున్నారు. కొద్ది రోజుల్లో అతడి మృతదేహం స్వదేశానికి రానుంది. అయితే ప్రవీణ్‌ ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు అనే విషయం తెలియడం లేదు. దీనికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

చదవండి: పోలింగ్‌ కేంద్రంలో జవాన్‌ ఆత్మహత్య

మరిన్ని వార్తలు