వాలెంటైన్స్‌ డే: ఫ్రీగా విడాకులు ఇప్పిస్తాం

4 Feb, 2021 10:44 IST|Sakshi

వెరైటీ ఆఫర్‌ ప్రకటించిన అమెరికా లా కంపెనీ

వాషింగ్టన్‌/టేనస్సీ : ప్రేమికుల దినోత్సవం నాడు ఒంటరి వ్యక్తులు జంటగా మారతారు. చాలా మంది ఇష్టపడే వ్యక్తికి తమ ప్రేమను తెలపడం కోసం ప్రేమికుల దినోత్సవం వరకు వెయిట్‌ చేసి.. వాలెంటైన్స్‌ డే నాడు ప్రపోజ్‌ చేస్తారు. అంటే ఒంటరిని జంటగా మార్చే రోజు. అయితే ఓ లా కంపెనీ మాత్రం వెరైటీగా ప్రేమికుల దినోత్సవం నాడు ఓ లక్కీ కపుల్‌కి ఫ్రీగా విడాకులు ఇప్పిస్తామని ప్రకటించింది. టేనస్సీ క్రాస్‌విల్లేలోని పవర్స్ లా ఫర్మ్ ఈ ఆఫర్‌ ఇచ్చింది. ఒక లక్కీ కపుల్‌ని సెలక్ట్‌ చేసి.. వారి విడాకులకు సంబంధించి ఉచితంగా లీగల్‌ సర్వీస్‌ చేస్తామని.. కోర్టు ఫీజు కూడా తీసుకోమని వెల్లడించింది. (చదవండి: బాయ్‌ఫ్రెండ్‌ లేకపోతే కాలేజీకి రావొద్దు)

ఈ మేరకు పవర్స్‌ లా తన ఫేస్‌బుక్‌ పేజిలో ‘‘ఈ ఏడాది ఎంతో భయంకరంగా గడిచింది. కరోనా వల్ల దేశం రెండుగా చీలడమే కాక ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఈ నేపథ్యంలో మేం ఓ లక్కి కంటెస్టెంట్‌కి వాలెంటైన్స్‌ డే సందర్భంగా ఉచితంగా విడాకులు ఇప్పించడానికి నిర్ణయించాము. ఎందుకంటే వాలెంటైన్స్‌ డే లాంటి పిచ్చి సంస్కృతి వల్ల మనిషి తన ఆర్థిక స్థితిని ఆలోచించుకోకుండా.. ప్రేమలో పడటం.. పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత ఇబ్బందులు ఎదుర్కొలేకనో.. మరి ఇతర కారణాల వల్లనో విడిపోవాలని భావిస్తున్నాడు. అలాంటి వారిలో ఒకరిని సెలక్ట్‌ చేసి ఉచితంగా విడాకులు ఇప్పిస్తాం. ఇక మన దేశంలో విడాకులు తీసుకోవడం ఎంత ఖర్చుతో కూడుకున్న పనే తెలిసిందో. 1150 డాలర్ల నుంచి ప్రారంభం అవుతుంది. చాలా మంది దీన్ని భరించే స్థితిలో కూడా లేరు. అందుకే ఈ ఆఫర్‌’’ అని సంస్థ ఫేస్‌బుక్‌ వేదికగా ప్రకటించింది. 
(చదవండి: 57వ ఏట మళ్లీ ప్రేమను అనుభూతి చెందాను)

ఇక ఆసక్తి ఉన్న వారు తాము ఎందుకు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారో తెలుపుతూ.. తన కంపెనీకి ఈమెయిల్‌ చేయాల్సిందిగా సూచించింది. అంతేకాక భార్యభర్తలిద్దరు విడాకులకు సిద్ధంగా ఉండాలని.. సంతానం ఉండకూడదు అని వెల్లడించింది. ఇక ఇందులో ఉచితంగా పాల్గొనవచ్చని తెలిపింది. విన్నర్‌ని ఫిబ్రవరి 19న ప్రకటిస్తామని వెల్లడించింది. 

మరిన్ని వార్తలు