ఫ్రాన్స్‌లో ఉగ్ర దాడి : ముగ్గురు మృతి

29 Oct, 2020 16:07 IST|Sakshi

పారిస్‌ : ఫ్రాన్స్‌ నగరం నీస్‌లో గురువారం జరిగిన ఉగ్ర దాడిలో మహిళ సహా ముగ్గురు మరణించారు. కత్తితో చర్చిలో ప్రవేశించిన ఆగంతకుడు మహిళపై దాడి చేసి ఆమె తలను నరికేశాడని మరో ఇద్దరు ఈ ఘటనలో మరణించారని అధికారులు తెలిపారు. ఇది ఉగ్రవాద చర్యేనని నీస్‌ మేయర్‌ క్రిస్టియన్‌ ఎస్త్రోసి వెల్లడించారు. నగరంలోని నాట్రేడేమ్‌ చర్చిలో ఈ ఘటన జరిగిందని, దాడికి పాల్పడిన దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. దాడికి తెగబడిన వ్యక్తి ఓ మతానికి సంబంధించి నినాదాలు చేశాడని చెప్పారు.

మరణించిన వారిలో ఒకరిని చర్చి వార్డెన్‌గా భావిస్తున్నామని మేయర్‌ పేర్కొన్నారు. బాధితులను కిరాతకంగా చంపారని అన్నారు. నిందితుడు పారిపోతుండగా పోలీసులు కాల్పులు జరిపారని ప్రస్తుతం నిందితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని చెప్పారు. కాగా, ఈ దాడిలో ముగ్గురు మరణించారని, పలువురికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఫ్రాన్స్‌ ఉగ్రవాద వ్యతిరేక ప్రాసిక్యూషన్‌ విభాగం దర్యాప్తు చేపట్టనుంది. ఫ్రాన్స్‌లో ఈ తరహా దాడి ఈ నెలలో ఇది రెండవది కావడం​ గమనార్హం. ఫ్రెంచ్‌ మిడిల్‌ స్కూల్‌ టీచర్‌ను ఇటీవల చెచెన్యా సంతతికి చెందిన ఓ వ్యక్తి తలనరికి చంపడం కలకలం రేపింది. చదవండి : ఫ్రాన్స్‌లో టీచర్‌ తలనరికిన యువకుడు

మరిన్ని వార్తలు