ప్రియుడి 23 లక్షల బైక్‌ను తగలబెట్టేసిన ప్రియురాలు

28 Jun, 2021 15:38 IST|Sakshi

బ్యాంకాక్‌: ప్రేమ.. మాటల్లో వర్ణించలేని గొప్ప ఫీలింగ్‌. ఒకరి మనుసు ఒకరు తెలుసుకొని జీవితాంతం తోడుగా నిలవాలని ఎంతో మంది కలలు కంటుంటారు. కానీ తమ ప్రేమను పెళ్లితో మూడేసి నూరేళ్లు జీవించేవాళ్లు కొందరే. మనస్పర్థలు, నమ్మకం కోల్పోవడం వంటి కారణాలతో మధ్యలోనే విడిపోయే వారు కోకొల్లలు. కొంతమంది బలమైన కారణంతో బ్రేకప్‌ మరికొంతమంది సిల్లీ రీజన్స్‌తో విడిపోతుంటారు. అయితే అచ్చం ఇలాగే థాయ్‌లాండ్‌కు చెందిన ఓ జంట కొంతకాలం ప్రేమించుకున్నారు. ఆ సమయంలో కనాక్‌ వావన్‌ అనే యువతి తన లవర్‌కు లక్షల విలువైన బైక్‌ను గిఫ్ట్‌గా అందించింది. తరువాత కొన్ని కారణాలతో వారు విడిపోయారు.

అయితే తను ఇచ్చి బైక్‌ను తిరిగి ఇవ్వాలని యువతి అతన్ని కోరింది. ఇందుకు యువకుడు నిరాకరించాడు. దీంతో ఎలాగైన మాజీ ప్రేమికుడిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. ఓ ప్లాన్‌ వేసింది. బ్యాంకాక్‌లోని ఓ భవనం మూడో అంతస్తులో ప్రియుడి బైక్‌ పార్క్‌ చేసి ఉందని తెలుసుకుంది. అక్కడికి వెళ్లి ఆమె ఇచ్చిన లగ్జరీ బైక్‌ను పెట్రోల్‌ పోసి తగలబెట్టింది. ఈ క్రమంలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. పక్కనే ఉన్న మరో ఆరు బైక్‌లకు కూడా మంటలు అంటుకున్నాయి. అయితే అక్కడున్న సిబ్బంది వెంటనే తెరుకొని అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పింది.

అనంతరం సీసీ టీవీఫుటేజీని పరిశీలించగా  అసలు విషయం బయటపడింది. ప్రమాదం జరిగడానికి ముందు ఓ మహిళ వచ్చి ఓ బైక్‌ మీద పెట్రోల్‌ పోసి తగలబెట్టడం పోలీసులు గమనించారు.  ప్రమాదానికి కనాక్‌ వావన్‌ కారణమని తెలుసుకొని ఆమెను అరెస్ట్‌ చేసి విచారించగా మరిన్ని వివరాలు బయటకొచ్చాయి. ఆ బైక్‌ ధర ఒక మిలియన్‌ బాట్‌ అంట. అంటే మన కరెన్సీలో సుమారు ₹23 లక్షల వరకు ఉంటుంది. ఇద్దరూ ప్రేమలో ఉన్నప్పుడే ఆమె కొనిచ్చనని, ఇప్పుడు విడిపోవడంతో అతని మీద కోపంతో ఆ బైక్‌ను తగలబెట్టాలని తెలిపింది.దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

చదవండి: వీడియో వైరల్‌: భారీగా బరువు తగ్గిన కిమ్‌ జాంగ్‌

మరిన్ని వార్తలు