మూలకణాలతో పిండం అభివృద్ధి!

3 Jul, 2021 08:55 IST|Sakshi

సృష్టికి ప్రతిసృష్టి చేయడంలో మనిషి ఇంకో అడుగు ముందుకేశాడు. శరీరంలోని ఏ కణంగా అయినా మారిపోగల సామర్థ్యమున్న మూలకణాలతో ఏకంగా ఓ పిండాన్ని యూనివర్సిటీ ఆఫ్‌ వర్జీనియా స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు చెందిన థిస్సీ ల్యాబ్‌ అభివృద్ధి చేశారు. ఈ పద్ధతిని మరింత అర్థం చేసుకుంటే.. భవిష్యత్తులో మనిషికి కావాల్సిన అవయవాలను ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసుకోవచ్చని చెబుతున్నారు. క్రిస్టీన్, బెర్నార్డ్‌ థిస్సే అనే ఇద్దరు శాస్త్రవేత్తలు మూలకణాలతో పిండం తయారు చేయడం ఎలా అన్న దానిపై పరిశోధనలు చేపట్టి పాక్షిక విజయం సాధించారు. చేపలతో మొదలుపెట్టి ఎదురైన వైఫల్యాలను అర్థం చేసుకుని సరిదిద్దుకోవడం ద్వారా ఈ శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో ముందడుగు వేశారు. ఎలుకల నుంచి సేకరించిన పలు మూలకణాలతో ప్రయోగాలు చేశామని క్రిస్టీన్‌ తెలిపారు.

తామిచి్చన సూచనలకు అనుగుణంగా మూలకణాలు దశలవారీగా పిండం లాంటి నిర్మాణంగా ఎదిగాయని, ఈ క్రమంలో అవి పిండం అభివృద్ధి చెందే దశలు ఒక్కొక్కటీ దాటాయని వివరించారు. ఇలా అభివృద్ధి చెందిన నిర్మాణంలో ఎలుక పిండంలో మాదిరిగానే పలు రకాల కణజాలం కనిపించిందని తెలిపారు. అయితే ప్రస్తుతానికి తాము పూర్తిస్థాయిలో ఎదిగిన పిండాన్ని తయారు చేయలేకపోయామని చెప్పారు. మెదడును అభివృద్ధి చేయడం తమ ముందున్న అతిపెద్ద సవాల్‌ అని, ఈ సమస్యను అధిగమిస్తేనే పూర్తిస్థాయి పిండం తయారీ వీలవుతుందని వివరించారు.

మరిన్ని వార్తలు