ఇప్పట్లో ప్రపంచం అంతం కాదు.. ఇదిగో ప్రూఫ్‌లు

31 Jul, 2021 19:48 IST|Sakshi
ప్రూఫ్‌గా ఫొటో చూపిస్తున్న టైమ్‌ ట్రావెలర్‌ ఎడ్వర్డ్‌

లాస్‌ ఏంజెల్స్‌: భూగోళం అంతం గురించి ఎన్నో వార్తలు వింటున్నాం. ఆ రోజు అంతమైతది.. ప్రపంచంలో జీవి అనేదే ఉండదు.. భూగోళం మునిగిపోతుంది అని తదితర విషయాలు ప్రజలను భయాందోళన రేకెత్తించేలా వస్తుంటాయి. పైగా బ్రహ్మాంగారు చెప్పారు.. ఇదిగో సూచనలు.. సంకేతాలు అంటూ చెబుతూ మరికొందరు చెబుతుంటారు. అయితే ఇప్పుడు తాజాగా ఒకరు మన ఆదిత్య-369 సినిమాలో మాదిరి ఒక వ్యక్తి భవిష్యత్‌ కాలానికి వెళ్లి వచ్చాడట. ఇప్పట్లో భూగోళం అంతం కాదని తేల్చి చెప్పాడు. 5 వేల సంవత్సరానికి మాత్రం ప్రపంచం ఉండదంటూ.. ఇదిగో నేను చెప్పే దానికి ప్రూఫ్‌లుగా చెబుతూ కొన్ని ఫొటోలు చూపిస్తున్నాడు. ఈ వార్త ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది.

ఎడ్వర్డ్‌ అనే ప్రయాణికుడు ఈ విషయాన్ని తెలిపాడు. ఓ యూట్యూబ్‌ ఛానల్‌ అపెక్స్‌​ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘నేను భవిష్యత్‌కు వెళ్లానని.. ఆ సమయంలో భూగోళం అంతా నీటిలో మునిగిపోయి ఉంది’ అని వివరించాడు. ఇవిగో వాటికి ప్రూఫ్‌ అంటూ కొన్ని ఫొటోలను చూపించాడు. నీటిలో ఒక నగరమంతా మునిగి ఉన్న ఫొటోను బహిర్గత పరిచాడు. కేవలం భవనాలు తప్పా ఇంకేమీ కనిపించడం లేదు. ఐదు వేల సంవత్సరంలో భూగోళం మునిగిపోయింది అని చెప్పాడు.

2004లో తాను 3 వేల సంవత్సరాలు దాటి భవిష్యత్‌ కాలానికి వెళ్లినట్లు తెలిపాడు. ‘నేనొక కథ చెబితే మీకు అద్భుతంగా అనిపిస్తుంది. 2004లో నేను ఓ సీక్రెట్‌ మిషన్‌ ద్వారా భవిష్యత్‌ కాలానికి వెళ్లాను. అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌ నగరమంతా నీటిలో మునిగిపోయి ఉంది. వాతావరణ పరిస్థితుల కారణంగా అలా జరిగింది. అక్కడి నుంచి తిరిగివచ్చిన అనంతరం వాటికి సంబంధించిన ఫొటోలను లాబోరేటరిలో చూడగా ఈ విషయం తెలిసింది’ అని ఎడ్వర్డ్‌ తెలిపారు. ఈ ఇంటర్వ్యూ 2018 ఫిబ్రవరిలో చేయగా తాజాగా మళ్లీ బయటకు వచ్చి సంచలనంగా మారింది.

‘అప్పుడు నేను ఓ చెక్కపై నిలబడ్డా. నేనొక్కడినే కాదు ఇళ్లు, భవనాలు అన్నీ కలపతో చేసి ఉన్నవే. అప్పుడు నేను ఇది లాస్‌ ఏంజిల్స్‌ నగరంగా గుర్తించా.’ అని వివరించాడు. అయితే ఇంటర్వ్యూ ఇచ్చిన ఎడ్వర్డ్‌ ముఖం కనిపించకుండా చేశారు. అతడి స్వరాన్ని కూడా కొద్దిగా మార్చి ప్రసారం చేశారు. అతడికి ఏమైనా ఇబ్బందులు కలగవచ్చు అనే ఉద్దేశంతో ఇలా చేశారు. ఇది నేను తొలిసారి చేసిన ‘టైమ్‌ యాత్ర’ కాదు అని ఎడ్వర్డ్‌ చెబుతున్న వీడియో వైరల్‌గా మారింది. అయితే ప్రపంచం అంతం అవుతుందనే వార్తలు గతంలో కూడా చాలా వచ్చాయి. ఎడ్వర్డ్‌ చెబుతున్న దాన్ని చూస్తుంటే ఇప్పట్లో ప్రపంచం అంతం కాదనే విషయం స్పష్టమవుతోంది. మన పిల్లలు తాతముత్తాలు అయినా కూడా ఈ భూగోళం సురక్షితంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ వార్తతోనైనా ఇకపై భూగోళం అంతం వార్తలు నమ్మొద్దు అని సోషల్‌ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు