కాలమే నిర్ణయిస్తుంది : ట్రంప్‌

14 Nov, 2020 11:24 IST|Sakshi

లాక్‌డౌన్‌ అమలు చేసేది లేదన్న ట్రంప్‌

వాషింగ్టన్ ‌:  అమెరికా అధ్యక్ష  ఎన్నికల్లో తుది ఫలితాలు వెల్లడయ్యాయి. బైడెన్‌కు 306, ట్రంప్‌కు 232 ఎలక్టోరల్ ఓట్లు రాగా, జార్జియాను బైడెన్‌ కైవసం చేసుకున్నారు. నిన్న మొన్నటివరకు అధికార మార్పిడికి  అడ్డుతగిలిన ట్రంప్‌ తుది ఫలితాల అనంతరం వెనక్కి తగ్గారు. కోర్టుకు  వెళ్లే అంశంపై ట్రంప్ పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. దీంతో అధికార మార్పిడి దిశగా అమెరికాలో వేగంగా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇంతకుముందు ఎన్నికల్లో మోసాలు జరిగాయని ట్రంప్‌ ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. అటార్నీ జనరల్‌ విలియం బార్‌ ఓటింగ్‌ అక్రమాలపై విచారణకు న్యాయశాఖకు అనుమతి ఇవ్వడం, అధికార మార్పిడికి సంబంధించి బైడెన్‌ బృందానికి సహకరించకుండా ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డుకోవడం వంటివి చేశారు. ఓటమిని జీర్ణించుకోలేని ట్రంప్‌ ఒకవైపు పెంటగన్‌ అధ్యక్షుడిని తప్పించారు. అయితే తాజా పరిణామాల అనంతరం ట్రంప్‌ కాస్త వెనక్కి తగ్గారు. అయితే తన తన మద్దతుదారులను సంఘటితంగా ఉంచేందుకు ట్రంప్ ఎన్నికల తరహా స్టాఫ్‌ ది స్టీల్, మిలియన్ మెగా మార్చ్‌,  విమెన్ ఫర్ అమెరికా ఫస్ట్ అనే పేర్లతో ర్యాలీలు నిర్వహించే అవకాశం ఉంది. (అధికార మార్పిడికి ట్రంప్‌ మోకాలడ్డు! )

మరోవైపు ఓటమి గురించి పరోక్ష వ్యాఖ్యలు  చేశారు. వైట్‌హౌస్‌లోని రోజ్‌ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఏదైనా జరగొచ్చు. వచ్చేది ఏ ప్రభుత్వమో ఎవరికి తెలుసు..దీనికి సమయమే సమాధానం చెబుతుందని భావిస్తున్నానంటూ  వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. అయితే  బైడెన్‌ వల్ల ఒరిగేదేమీ లేదని, పరిస్థితిలో ఎలాంటి మార్పు ఉండబోదని ట్రంప్‌ గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఒకవేళ తన స్థానంలో బైడెన్‌ ఉంటే, కరోనా వ్యాక్సిన్‌ ఎప్పటికీ వచ్చి ఉండేది కాదని కూడా విమర్శించారు. ప్రస్తుతం తాను మాత్రం  కరోనా కట్టడికి దేశంలో లాక్‌డౌన్‌ అమలు చేసే ప్రసక్తే  లేదని ట్రంప్‌ స్పష్టం చేశారు.  లాక్‌డౌన్‌ వల్ల రోజుకు 50 బిలయిన్‌ డాలర్లు నష్టపోయే ప్రమాదం ఉందని  పేర్కొన్నారు. ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ గెలుపుపై ఇన్నిరోజులుగా నిశ్శబ్దం ఉన్న చైనా ఎట్టకేలకు మౌనం వీడింది. ఎన్నికల్లో గెలిచిన బైడెన్‌, కమలా హ్యారీస్‌లకు అభినందనలు తెలిపింది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్‌ బెంగ్‌ మాట్లాడుతూ.. ‘అమెరికా ప్రజల నిర్ణయాన్ని గౌరవిస్తాం అని అన్నారు. గత రెండేళ్లుగా చైనా -అమెరికా విభేధాలు తారా స్థాయికి చేరిన విషయం తెలిసిందే.  (ట్రంప్‌ వైఖరి ఇబ్బందికరమే)

మరిన్ని వార్తలు