బైడెన్‌ ప్రమాణస్వీకారం.. ఎమర్జెన్సీ విధించిన ట్రంప్‌

12 Jan, 2021 10:38 IST|Sakshi

ఎఫ్‌బీఐ హెచ్చరికల నేపథ్యంలో కీలక నిర్ణయం

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వాషింగ్టన్‌లో రెండు వారాల పాటు ఎమర్జెన్సీ విధించారు. వారం రోజుల క్రితం అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలకు వ్యతిరేకంగా ట్రంప్‌ మద్దతుదారుల క్యాపిటల్‌ హిల్‌ బిల్డింగ్‌ మీద దాడి చేయడమే కాక ప్రభుత్వ ఆస్తులను నాశనం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నూతన అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రమాణ స్వీకారం సమయంలో ఉద్రిక్తతలు తలెత్తకుండా.. ముందు జాగ్రత్తగా చర్యగా ట్రంప్‌ వాషింగ్టన్‌లో ఎమర్జెన్సీ విధించారని వైట్‌హౌస్‌ ప్రెస్‌ ఆఫీస్‌ సోమవారం వెల్లడించింది. ‘ఈ రోజు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. 59వ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని జనవరి 11 నుంచి 24 వరకు ఎమర్జెన్సీ ప్రకటించారు. గత వారం ట్రంప్‌ మద్దతుదారలు క్యాపిట్‌ల హిల్‌పై దాడి చేయడం వల్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో ఫెడరల్‌ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది’ అని ప్రకటనలో ఉంది. (చదవండి: యూఎస్‌లో హింసాత్మకం: ట్రంప్‌ తీరుపై ఆగ్రహం)

ఈ నిర్ణయం వెలువడిన తర్వాత వాషింగ్టన్లో అత్యవసర పరిస్థితుల వల్ల స్థానిక జనాభాకు కలిగే కష్టాలను, బాధలను తగ్గించడం.. విపత్తు సహాయక చర్యలను సమన్వయం చేయడం.. స్టాఫోర్డ్ చట్టం టైటిల్ 5 కింద అధికారం పొందిన అవసరమైన అత్యవసర చర్యలకు తగిన సహాయం అందించడం.. ప్రాణాలను కాపాడటం, ఆస్తిని రక్షించడం, ప్రజారోగ్యం, భద్రత, విపత్తు ముప్పును తగ్గించడం, నివారించడం వంటి బాధ్యతలన్ని ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ, హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం పర్యవేక్షిస్తుంది. ఇక ఈ అత్యవసర సహాయ చర్యలకు అవసరమైన నిధులను ఫెడరల్‌ ప్రభుత్వమే 100 శాతం అందిస్తుంది. (చదవండి: చివరి రోజుల్లో.. అవమానభారంతో...)

జో బైడెన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా ట్రంప్‌ మద్దతుదారులు ఈ వీకెండ్‌, జనవరి 20న మొత్తం 50 రాష్ట్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తోన్నట్లు ఎఫ్‌బీఐ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది. ఈ మేరకు పెంటగాన్‌ వాషింగ్టన్‌ సిటీలో మరోసారి దాడులు జరగకుండా చూడాలనే ఉద్దేశంతో క్యాపిటల్‌ సిటీలో 15 వేల మంది జాతీయ భద్రతా దళాలను మోహరించింది. 

ట్రంప్‌కు మరో షాకిచ్చిన ట్విట్టర్‌
డొనాల్డ్‌ ట్రంప్‌ విషయంలో ట్విట్టర్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ట్రంప్‌నకు అనుకూలంగా ఉన్నా 70 వేల ఖాతాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ట్రంప్‌ అధికారిక ఖాతాను శాశ్వతంగా నిషేధించిన ట్విట్టర్‌.. తాజాగా ఆయన మద్దతుదారుల అకౌంట్‌లను కూడా నిలిపివేసింది. ఇక ట్రంప్‌ అనుకూల పోస్టులపై ఫేస్‌బుక్‌ చర్యలు తీసుకుంది. ఎఫ్‌బీలో 'ఆమోదాన్ని ఆపండి' అనే పోస్టుపై ట్రంప్‌ మద్దతుదారలు పోస్టులు పెడుతున్నారు. దాంతో ఎఫ్‌బీ ‘ఆమోదాన్ని ఆపండి’ అనే పదం ఉన్న అన్ని పోస్టులను తొలగించింది.

మరిన్ని వార్తలు