ఆ ఓట్లు లెక్కిస్తే విజయం నాదే: ట్రంప్‌

6 Nov, 2020 08:44 IST|Sakshi

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం ఎన్నికలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. వైట్‌హౌస్‌కి చేరేది ఎవరో తేలడానికి కేవలం ఆరు ఓట్ల దూరం మాత్రమే ఉంది. ఇప్పటివరకు జరిగిన కౌంటింగ్‌లో జో బైడెన్‌ 264 ఓట్లు సాధించగా.. ట్రంప్‌ 214 దగ్గర ఆగిపోయారు. బైడెన్‌ గెలుపు ఖాయంగా కనిపిస్తుంది. ఇక ట్రంప్‌ గెలవాలంటే నిజంగానే ఏదైనా అద్భుతం జరగాలి. ఈ నేపథ్యంలో ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయపరంగా తాను గెలిచానని ప్రకటించారు. ఇక అధ్యక్ష ఎన్నికల్లో మీడియా, టెక్‌ సంస్థల జోక్యం భారీగా ఉందని ఆరోపించారు. నిర్ణయాత్మకంగా ఇప్పటికే తాను గెలిచాను అన్నారు. ఈ సందర్భంగా ట్రంప్‌ మాట్లాడుతూ.. ‘ఒకవేళ చట్టపరమైన ఓట్లను కౌంట్‌ చేస్తే నేను చాలా సులభంగా గెలుస్తాను. కానీ వారు మమ్మల్ని ఓడించడానికి అక్రమ ఓట్లను ఉపయోగించారు’ అని ఆరోపించారు. ఇక మీడియా కూడా తప్పుడు ప్రచారం చేస్తుందని మండి పడ్డారు. బ్లూ వేవ్‌ వచ్చింది అంటూ జనాలను గందరగోళంలో పడేసింది అన్నారు. కానీ డెమొక్రాట్లు మాత్రం మీడియా అంచానలను నిజం చేయలేకపోయారని.. తాను న్యాయంగా ఎన్నికల్లో విజయం సాధించానని అన్నారు ట్రంప్‌. (చదవండి: అడుగు దూరంలో బైడెన్‌)

డెమొక్రాట్లు విజయం సాధించారు అనే భ్రమ కల్పించడానికి.. నిధుల సేకరణలో రిపబ్లికన్ల సామర్థ్యాన్ని దెబ్బ తీయడానికి వారు కుట్రలు చేస్తున్నారు అని ట్రంప్‌ మండి పడ్డారు. అనేక న్యూస్ నెట్‌వర్క్‌లు ప్రసారం చేసిన ఎగ్జిట్ పోల్స్‌ను ‘అణచివేత పోల్స్’ గా పేర్కొన్నారు. రిపబ్లికన్ పార్టీ అమెరికన్ ప్రజలను సూచిస్తుందని, అంతర్భాగానికి చిహ్నంగా నిలుస్తుందన్నారు. ఇక మొత్తం ఎన్నికల ప్రక్రియలో ‘డబ్బు, టెక్నాలజీ, మీడియా’ పెద్ద ఎత్తున డెమొక్రాట్లకు మద్దతు ఇచ్చాయని ఆరోపించారు. “అణచివేత.. అధ్యక్ష రేసులో  కొన్ని రాష్ట్రాల్లో గెలుపు, ఓటమి ఇంకా నిర్ణయించబడలేదు. ఈ రాష్ట్రాల్లో ఓటింగ్‌ ప్రక్రియని డెమొక్రాట్లు నిర్వహిస్తున్నారు. పలు కీలక రాష్ట్రాల్లో మేం చాలావరకు గెలిచాము. కానీ అనూహ్యంగా మా ఓట్లు దూరమవుతున్నాయి” అన్నారు. డెమొక్రాట్లు ఓటరు అణచివేతకు పాల్పడుతున్నారని ట్రంప్‌ ఆరోపించారు. (అమెరికా ఎన్నికలు: మేయర్‌గా ఎన్నికైన కుక్క..)

రిపబ్లికన్ పోల్ పరిశీలకులను కౌంటింగ్‌ కేంద్రాలకు దూరంగా ఉంచారని ఆరోపిస్తూ తన ప్రచార బృందం ఎన్నికల ప్రక్రియపై పలు వ్యాజ్యాలని దాఖలు చేసిందని తెలిపారు ట్రంప్‌. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో బ్యాలెట్-కౌంటింగ్ కేంద్రాల్లోని లెక్కింపు ప్రక్రియని ప్రత్యక్ష ప్రసారం చేశారని.. కానీ మెయిల్-ఇన్ ఓటింగ్ విధానం ‘అవినీతి’ అని, అది ‘ఓటింగ్ వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిందని’  ట్రంప్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని వార్తలు